వైయస్ జగన్ అరెస్టు కాకపోవడం వెనుక...: యనమల

వైయస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయన్నారు. ఆయన వేలాది ఎకరాల భూములను బినామీల పేరున దారాదత్తం చేశారన్నారు. వైయస్ హయాంలోని భూకేటాయింపుల పైన కాగ్ నివేదిక తప్పు పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 2004 నుంచి జరిగిన అక్రమాలపై హైకోర్టులో ఆధారాలతో సహా పిటిషన్ వేశామని ఆయన చెప్పారు. తమ ఆరోపణలతో కోర్టు కూడా ఏకీభవించి సిబిఐ దర్యాఫ్తుకు ఆదేశించిందన్నారు.
వైయస్ చేసిన అవినీతి అక్రమాలపై ఒక్క తెలుగుదేశం పార్టీయే కాదని అన్ని రాజకీయ పక్షాలు కోడై కూస్తున్నాయన్నారు. మీడియా కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలు వెల్లడిస్తోందన్నారు. దేశ చరిత్రలో ఇటువండి దోపిడీ ఎన్నడూ జరగలేదన్నారు. సాక్షి ఛానల్, సాక్షి పత్రికలు తెలుగుదేశం పార్టీ పైన, మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన తప్పుడు కథనాలు ఇస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
జగన్కు చెందిన సాక్షి తప్పుడు కథనాలు ఇవ్వడం శోచనీయమన్నారు. సిబిఐ కేసులో ఎ1 ముద్దాయిగా ఉన్న వైయస్ జగన్ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. జగన్ అంటే కాంగ్రెసుకు భయమన్నారు. గతంలో జగన్ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తర్వాతే ఆయన అరెస్టులో జాప్యం జరుగుతోందన్నారు. ఆయన అరెస్టు కాకపోవడం వెనుక కాంగ్రెసు ప్రభుత్వం హస్తం ఉందన్నారు. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సోనియా గాంధీ పైన ఎటువంటి విమర్శలు చేయడం లేదన్నారు. ఆయన ఆరోపణలు తగ్గించారన్నారు.












Click it and Unblock the Notifications