తెలంగాణపై వైయస్ బెదిరించారు: సారయ్య సంచలనం
తాను తెలంగాణ కోసం సభ పెడితే మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటానని వైయస్ తనకు స్వయంగా చెప్పి బెదిరించారన్నారు. తాను ఆయన వ్యాఖ్యలకు లొంగలేదు కాబట్టే తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదని ఆరోపించారు. తాను తెలంగాణ కోసం అప్పుడు ఇప్పుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నాను కాబట్టే పదివేల మందితో మీటింగ్ పెట్టానని చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ బిడ్డల మనోభావాలకు అనుగుణంగానే వైయస్ వద్దని చెప్పినప్పటికీ తాను ఆనాడు సమావేశం పెట్టానని చెప్పారు. కాగా వైయస్ రాజశేఖర రెడ్డిపై పలువురు మంత్రులు ఎదురు దాడి ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.
మొన్న మంత్రి కొండ్రు మురళీ మోహన్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేయగా ఇప్పుడు బస్వరాజు సారయ్య చేశారు. కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంత రావు కూడా ఆయనపై తీవ్రస్థాయిలో మరోసారి విరుచుకు పడ్డారు. కాగా బస్వరాజు సారయ్య దివంగత వైయస్ పైన చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి ఖండించారు.