తప్పులు చేసి వైయస్పై నెడుతున్నారు: వైయస్ జగన్

శ్రీకాకుళం జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా నరసన్నపేటలో బుధవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. హిందూజా పవర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తమ తండ్రిపై తప్పుడు ప్రచారానికి దిగజారుతోందని ధ్వజమెత్తారు. తన బహిరంగ సభ జరుగుతున్న సమయంలో నరసన్నపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని జగన్ ఆక్షేపించారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా, ఎమర్జెన్సీ రాజ్యమా అని ప్రశ్నించారు.
దేవుడు చల్లగా చూస్తే రాష్ట్రంలో మళ్లీ వైఎస్ హయాం నాటి స్వర్ణయుగం వస్తుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కళింగవైశ్యులను బీసీల్లో చేర్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సభలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, నరసన్నపేట తాజా మాజీ ఎమ్మె ల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ పద్మప్రియ ప్రసంగించారు.
మరణించి ఇన్నాళ్లయినా వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ దళితులకు, పేదలకు, రైతులకు వ్యతిరేకి అని ముద్ర వేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి దళితులు, రైతులు, పేదల సంక్షేమానికి తపనపడ్డారని ఆయన అన్నారు. అహరహం శ్రమించి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications