హత్యకు గురైన నటి తల కోసం పోలీసుల అన్వేషణ
గత నెలలో ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. అలహాబాద్లోని దర్బంగా కాలనీ ప్రాంతంలోని సెప్టిక్ ట్యాంకులో ఆమె శవం కనిపించింది. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేపాలీ జాతీయురాలైన 26 ఏళ్ల మీనాక్షి థాపా హీరోయిన్ అనే సినిమాలో చిన్న పాటి పాత్రకు ఎంపికైంది.
జూనియర్ ఫిల్మ్ ఆర్టిస్టులు అమిత్ జైస్వాల్, ప్రీతి సరీన్ ఆమెను కిడ్నాప్ చేసి కుటుంబం నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు ఆమెను హత్య చేశారు. తను సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చానని మీనాక్షి థాపా ఆ జూనియర్ ఆర్టిస్టుల ముందు కోతలు కోసినట్లు తెలుస్తోంది. దీంతో హీరోయిన్ వేషం ఇస్తామని చెప్పి ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారు.
అలహాబాద్కు చెందిన జూనియర్ ఆర్టిస్టులు ప్రీతి సరీన్, అమిత్ జైస్వాల్ను పోలీసులు ముంబైలో శనివారం అరెస్టు చేశారు. మధుర్ భండార్కర్ హీరోయిన్ సినిమాలో చిన్నపాటి పాత్ర లభించడంతో ఆమె రెండు నెలల క్రితం ముంబై వచ్చింది. అక్కడే ఆమెకు జైస్వాల్, ప్రీతి సరీన్లతో సాన్నిహిత్యం ఏర్పడింది.
మార్చి 12వ తేదీన జూనియర్ ఆర్టిస్టులిద్దరు మీనాక్షి థాపాను గోరఖ్పూర్ తీసుకుని వెళ్లారు. మీనాక్షి థాపా కుటుంబ సభ్యులు తమకు 15 లక్షల రూపాయలు ఇచ్చే స్థితిలో లేరని తెలుసుకుని, వారు ఆమెను హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఆమె తలను బస్సులోంచి లక్నో - అలహాబాద్ జాతీయ రహదారిపై విసిరేశారు. మొండాన్ని అలహాబాద్లోని ప్రీతి నివాసం వద్ద గల సెప్టిక్ ట్యాంకులో పడేశారు.
మీనాక్షి సోదరుడు నవరాజ్ను జూనియర్ ఆర్టిస్టులు ఫోన్లో డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో అతను డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జైస్వాల్, సరీన్లకు కోర్టు ఏప్రిల్ 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. తాను ముంబైలోని బ్యాంకులో పనిచేస్తున్నట్లు తన కుమారుడు చెప్పాడని జైస్వాల్ తండ్రి, న్యాయవాది సురేంద్ర జైస్వాల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.