తెలంగాణపై ఇప్పుడే తేల్చం, చర్చలు పూర్తి: ఆజాద్
ఇతర రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరపాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ స్థితిలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు దొడ్డ బుద్ధితో ఆలోచించాలని, పార్లమెంటులో తమ బాధ్యతలను నిర్వహించాలని ఆయన సూచించారు. తమ పార్టీలో అన్ని స్థాయిల్లో - పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సీనియర్ నాయకులతో తాము చర్చలు పూర్తి చేశామని ఆయన చెప్పారు.
తగిన సమయంలో తమ పార్టీ చర్చలు జరుపుతుందని, ఇతర పార్టీలను విశ్వాసంలోకి తీసుకుని వాటితో చర్చలు జరపాల్సి ఉందని ఆయన చెప్పారు. పార్లమెంటు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సరిగా జరగని విషయాన్ని కాంగ్రెసుకు, ఇతర పార్టీలకు చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యులు గుర్తించాలని ఆయన అన్నారు.
తెలంగాణ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా - ప్రతి పార్లమెంటు సభ్యుడికి సభ లోపల తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుందని అన్నారు. సమస్యలను లేవనెత్తడంతో పాటు చట్టాలు చేయాల్సిన బాధ్యత కూడా ఉందని వారు గుర్తించాలని ఆయన అన్నారు.