వైయస్ విగ్రహాలు: జగన్ పార్టీ నేతకు గద్దర్ కౌంటర్
అంబేద్కర్తో వైయస్ రాజశేఖరరెడ్డికి పోలికా అంటూ ప్రశ్నించారు. ఇదే అంశంపై సోమవారం మాల సంఘాల ఆధ్వర్యంలో వాసవీ క్లబ్ ఆడిటోరియంలో చర్చా గోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విగ్రహాల ఏర్పాటు ప్రక్రియ ఓట్లు దండుకోవడానికేనని ఆయన విమర్శించారు.
సామాజిక న్యాయం కోసం కృషి చేసిన అంబేద్కర్ విగ్రహాల పక్కన సామ్రాజ్యవాద, ఆర్థిక రాజనీతితో ఎదిగిన వైయస్సార్ విగ్రహాలు ఎలా పెడతారని అడిగారు. దళితులు రాజకీయ శక్తిగా ఎదుగుతున్న సమయంలో కావాలనే ఇలాంటి వ్యాఖ్యలతో దుమారం రేపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
జూపూడి వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జలయజ్ఞం, మెట్రో రైలు, ఇతర పథకాల పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వైయస్ను అంబేద్కర్తో పోల్చడం సరి కాదని మాల ఐక్యసంఘాల వేదిక చైర్మన్ ఆవుల బాలనాథం అన్నారు.
వైయస్ కుటుంబానికి చిన్న పాలేరులా వ్యవహరిస్తూ, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన జూపూడి ప్రభాకర్ను మాల మహానాడు నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి, జూపూడి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సమావేశం కోరింది.