సూరి ద్వారానే భాను కిరణ్ పరిచయం: మంగళి కృష్ణ
తాను భానుతో కలిసి విజయవాడ ప్రాంతంలో భూములు కొన్నట్లు వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని, తాను విజయవాడకే వెళ్లలేదని ఆయన చెప్పారు. భూములు తన పేర ఉన్నట్లు చూపిన రిజిస్ట్రేషన్ల పత్రాల్లో తన ఫొటో ఎలా వచ్చిందో తెలియదని ఆయన అన్నారు. తనపై ఎవరో కుట్ర చేసి ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పెద్దవాళ్ల పేరు మీద కూడా రేషన్ కార్డులు తీసుకున్నట్లు విన్నామని, అలాగే తన ఫొటో ఎవరో అతికించి ఉంటారని ఆయన అన్నారు.
తనను ఇరికించి, తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఎవరు కుట్ర చేస్తున్నారని అనుమానిస్తున్నారని అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఆయన తెలుగు ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్తో ఫోన్లో మాట్లాడారు. తాను ఏ విధమైన పొరపాటు చేయలేదని, తనపై వస్తున్న ఆరోపణల మీద ఎలాంటి విచారణకైనా సిద్ధమని, పొరపాటు చేసినట్లు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు.
సూరి తనకు కావాల్సినవాడని, అందువల్ల తాను సూరిని ఎందుకు చంపుతానని ఆయన అన్నారు. సూరి కుటుంబం తనకు కావాల్సిందని, సూరిన చంపాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. సూరితో ఉన్న విభేదాల వల్ల భాను కిరణ్ ఏం చేశాడో తెలియదని ఆయన అన్నారు. టీవీలో చూసే సూరి హత్యకు గురైనట్లు తాను తెలుసుకున్నానని, తాను ఆ సమయంలో పులివెందులలో ఉన్నానని ఆయన చెప్పారు.
మంగళి కృష్ణ భాను కిరణ్ బినామీగా వ్యవహరిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. భానుతో కలిసి మంగళి కృష్ణ విజయవాడలో భూములు కొనుగోలు చేశాడని ఓ ప్రముఖ తెలుగు టీవి చానెల్లో వార్తాకథనం ప్రసారమైంది.