భానుకు మంగళి కృష్ణ తుపాకి ఇచ్చాడు: సిఐడి

మంగళి కృష్ణ ఇచ్చిన తుపాకిని భాను కిరణ్ మధ్యప్రదేశ్లోని సియోని పట్టణంలో దాచి పెట్టాడని సిఐడి వాదించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్ల్లో భాను కిరణ్ తిరిగాడని, ఆయా ప్రాంతాలను భాను కిరణ్ను తీసుకుని విచారించాల్సి ఉందని, ఆయా ప్రాంతాల్లో భానుకు సహకరించినవారి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉందని జయంతి కోర్టుకు చెప్పారు.
భాను కిరణ్ ఆస్తులకు మంగళి కృష్ణ బినామీగా వ్యవహరించాడని సిఐడి ఆరోపించింది. బాను కిరణ్ రూ. 800 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సంపాదించినట్లు సిఐడి ఆరోపించింది. హైదరాబాదు శివార్లలో భాను కిరణ్ పెద్ద యెత్తున భూముల సెంటిల్మెంట్లు చేశాడని సిఐడి ఆరోపించింది. భాను కిరణ్కు ఉన్న సంబంధాలపై, అతని కార్యకలాపాలపై సిఐడి ఆరా తీస్తోంది. విచారణను న్యాయమూర్తి అరగంట పాటు వాయిదా వేశారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ను సిఐడి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. భాను కిరణ్ను విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిఐడి సోమవారం కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. సూరి జైలులో ఉన్నప్పుడు భాను కిరణ్ పలు సెటిల్మెంట్లు చేశాడని, కోట్లాది రూపాయలు సంపాదించాడని సిఐడి వాదించింది.
భాను కిరణ్ పరారీలో ఉన్నప్పుడు కూడా మంగళి కృష్ణతో మాట్లాడాడని, ఈ సంబంధాలపై సమాచారం రాబట్టాల్సి ఉందని సిఐడి వాదించింది.












Click it and Unblock the Notifications