తిరుపతిపై జగన్ డౌట్: ఉప పోరుకు పార్టీలు రెడీ

తిరుపతి స్థానంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సందేహం వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతోంది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాటలను ఆ విధంగా అనిపిస్తోంది. తిరుపతిలో వైయస్సార్ సానుభూతి పనిచేస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. ఈ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి చిరంజీవి చేతిలో ఓడిపోయారు. ఈసారి కాంగ్రెసు అభ్యర్థిగా మంత్రి గల్లా అరుణకుమార్ కుమారుడు గల్లా జయదేవ్ను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాగా, వైయస్ జగన్ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి మొదటి విడత ప్రచారాన్ని చేపట్టి నిర్వహించారు. అనంతపురం, మాచర్ల తప్ప మిగతా నియోజకవర్గాలన్నింటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. వైయస్ జగన్ అవినీతిని, కాంగ్రెసు అసమర్థతను, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మద్యం సిండికేట్లతో సంబంధాలు వంటి అంశాలను చంద్రబాబు ప్రచారాస్త్రాలుగా చేసుకుని పోరాటానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్ దూకుడుకు కళ్లెం వేసే పనిలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది.
ఇదిలావుంటే, కాంగ్రెసు పార్టీ కూడా ఉప ఎన్నికలకు ఇది వరకే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర నాయకత్వం కొన్ని స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులతో సమన్వయ కమిటీలు వేసింది. ఖాళీ అయిన 18 స్థానాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుని ప్రతిష్టను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు నాయకత్వం ఉంది. నిజానికి, ఖాళీ అయిన 18 స్థానాలు కూడా కాంగ్రెసు పార్టీవే.
కాంగ్రెసు అధిష్టానం తన ప్రతినిధుల ద్వారా ఉప ఎన్నికలను నేరుగా పర్యవేక్షించడానికి పూనుకుంది. గులాం నబీ ఆజాద్తో పాటు వాయలార్ రవి, కెబి కృష్ణమూర్తి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రజాపథం కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దాన్ని నిలిపేశారు.
పరకాలలో మాత్రం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో పాటు బిజెపి, తెరాసలు గట్టిగా పోటీ పడే అవకాశాలున్నాయి. సిపిఐ సీమాంధ్ర స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తుండగా, పరకాలలో తెరాసకు మద్దతిస్తోంది. సిపిఎం కొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధపడింది. జయప్రకాష్ నారాయణ నాయకత్వంలోని లోకసత్తా కూడా కొన్ని చోట్ల పోటీ చేస్తోంది. ఏమైనా, ఉప పోరును మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
నెల్లూరు లోకసభ స్థానానికి మూడు పార్టీలు కూడా దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెసు అభ్యర్థిగా టి. సుబ్బిరామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తారు. ఈ స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.












Click it and Unblock the Notifications