కృష్ణా జిల్లాలో మంగళి కృష్ణతో కలిసి భాను భూములు?
బందరు పోర్టు వల్ల ఆ భూముల ధరలకు రెక్కలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్లు భూములు కొనుగోలు చేశారు. భాను కిరణ్ పేరు మీద, మంగళి కృష్ణ పేరు మీద భూములు రిజిష్టర్ అయిన ప్రతులను ఆ టీవీ చానెల్ ప్రసారం చేసింది. వారిద్దరి ఫొటోలతో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలను చూపించింది. అయితే, ఆ భూములను స్థానికులు కౌలుకు తీసుకుని వ్యవసారం చేస్తున్నారు. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే ఆ భూములకు రెక్కలకు వస్తాయనే ముందు చూపుతో భాను కిరణ్, తదితరులు ఆ భూములను కొనుగోలు చేసినట్లు ఆ న్యూస్ చానెల్ వ్యాఖ్యానించింది.
ఆ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు ఇవ్వడానికి సంబంధిత అధికారులు నిరాకరించారని, తాము సమాచారం హక్కు చట్టం ద్వారా వాటిని పొందామని ఎన్టీవి న్యూస్ చానెల్ ప్రతినిధి చెప్పారు. భాను కిరణ్, మంగళి కృష్ణ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు కూడా ఆ టీవీ చానెల్ చెప్పింది. ఇందుకు సంబంధించి హైదరాబాదులో ఆ కార్యాలయం కూడా ఉందని చెప్పింది.
అయితే, టీవీ చానెల్లో వచ్చిన వార్తాకథనాన్ని మంగళి కృష్ణ ఖండించారు. భానుతో గత మూడున్నరేళ్లుగా తాను మాట్లాడలేదని ఆయన చెప్పారు. తాను కృష్ణా జిల్లాలో భూములు కొనుగోలు చేసిన మాట అబద్ధమని, తన ఫొటోను ఎవరో అతికించి ఉంటారని ఆయన అన్నారు. తనపై కుట్ర చేసి తనను ఇరికించడానికి చూస్తున్నారని ఆయన అన్నారు. మొత్తం మీద, భాను కిరణ్ అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత విషయాలపై మబ్బులు తొలుగుతున్నాయి.