రాజ్యసభ సభ్యుడిగా చిరు ప్రమాణం, తెలుగులో రాపోలు
సిఎం రమేష్ కూడా మంగళవారంనాడే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చిరంజీవి, రేణుకా చౌదరి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెసు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సిఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన రవిశంకర్ ప్రసాద్, తదితరులు కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను చైర్మన్ అన్సారీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వారిలో నలుగురు కాంగ్రెసు నుంచి ఎన్నిక కాగా, ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమితులైన రేణుకా చౌదరిని కూడా కాంగ్రెసు అధిష్టానం రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆమెకు కూడా మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.