గల్లా జయదేవ్కు చిరంజీవి, కిరణ్ కుమార్ మోకాలడ్డు?

ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుపతిది ప్రత్యేకం. మిగతా స్థానాలలోని అభ్యర్థులు అందరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్లారు. తిరుపతి మాత్రం చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయింది. అక్కడ కాంగ్రెసుకు గెలుపు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి టిక్కెట్ కోసం కాంగ్రెసులో పోటీ పోటీ నెలకొంది.
ప్రధానంగా గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ పోటీ పడుతున్నారు. అయితే చిరు.. జయదేవ్ అభ్యర్థిత్వం పట్ల విముఖత చూపిస్తున్నారట. ఇటీవల తిరుపతిలో జరిగిన ఓ బహిరంగ సభలో గల్లా అరుణ, చిరంజీవి ఒకే వేదిక పైన ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చిరు తన వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.
అదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా జయదేవ్కు టిక్కెట్ ఇచ్చే విషయంలో అనుకూలంగా లేరట. పలు నియోజకవర్గాలలో సర్వేలు జరిపిన కాంగ్రెసు తిరుపతిలోనూ జరిపిందట. అక్కడ జయదేవ్ కన్నా వెంకట రమణను నిలబెడితేనే గెలుపు అవకాశాలు ఉంటాయని సర్వేలో తేలిందట. దీంతో కిరణ్ కూడా జయదేవ్ కంటే రమణ వైపే మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు.
మరోవైపు గల్లా జయదేవ్ మాత్రం టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ పెద్దలను కలిసి తాను ఎలా గెలుస్తానో చూపించే సర్వే రిపోర్టులను వారి ముందు ఉంచుతున్నారు. మహేష్, చిరంజీవి అభిమానుల అండ, కాంగ్రెసు కార్యకర్తల మద్దతుతో గెలుస్తానని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications