జగన్తో ఢీకి ఆజాద్ వ్యూహం, అభ్యర్థులపై తర్జన భర్జన

ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికను ఓ కొలిక్కి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల మధ్య, ఇతర నేతల మధ్య విభేదాలను పరిష్కరించే దిశలో దృష్టి సారించారు. విభేదాలతో పార్టీని గట్టెక్కించలేమని కిరణ్, బొత్సలకు ఆయన క్లాస్ పీకే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య విభేదాలు కాంగ్రెసు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉప ఎన్నికలలో గెలుపొందాలంటే మొదట నేతల మధ్య సమన్వయం చేయాలని ఇప్పటికే పలువురు నేతలు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. మొదట ఆజాద్ ఆ దిశలో నేతలను సమన్వయపరిచి తర్వాత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను, జగన్ను ఎదుర్కొనే అంశంపై దృష్టి సారించనున్నారు. ఉప ఎన్నికలు జరగనున్న పలు నియోజకవర్గాలలో ఆయన పర్యటించే అవకాశం కూడా ఉంది.
సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఎంపీ కావూరి సాంబశివ రావు, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు హాజరయ్యారు. ఆజాద్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. దాదాపు మూడు నెలల తర్వాత ఈ సమావేశం జరుగుతోంది.
వాయలార్ రవి అధిష్టానానికి ఇచ్చిన నివేదిక పైన ఆజాద్ ఈ సమావేశంలో చర్చిస్తున్నారని సమాచారం. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును వాడాలా వద్దా అనే అంశంపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర నేతలుగా ఉప ఎన్నికల కోసం మీరేం చేయలేదు కాబట్టి మేం సూచించే రోడ్ మ్యాప్లో వెళ్లాలని ఆజాద్ వారికి సూచించినట్లుగా సమాచారం. చిరంజీవిని ఉప ఎన్నికలలో బాగా వినియోగించుకోవాలని ఆజాద్ సూచించినట్లుగా సమాచారం.
కాగా రాయచోటి, రాజంపేట అభ్యర్థులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సక్రమంగా లేదని పలువురు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నియోజకవర్గాల అభ్యర్థులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాప్ రెడ్డి మొదట పోటీకి ససేమీరా అన్నప్పటికీ ఆ తర్వాత అతనిని అధిష్టానం ఒప్పించింది.
మధ్యాహ్నం గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే హైదరాబాద్ వచ్చారు. వారికి బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ఎంపీలు భేటీ అయి పార్లమెంటులో ఎలా వ్యవహరించాలనే వ్యూహంపై చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications