జగన్ సాక్షికి యాడ్స్ ఎసరు?, జగతి పైన సిబిఐ..

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమంగా కోట్లాది రూపాయలు జగన్ సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఆయన ఆస్తులపై విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ కోర్టులో ఛార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సాక్షి పత్రిక, సాక్షి ఛానల్కు ప్రకటనలు ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం న్యాయవాదుల సలహాలు తీసుకొని జివోను రూపొందించిందని తెలుస్తోంది.
ఈ జివో రెండు రోజులలో విడుదల కావొచ్చునని అంటున్నారు. జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్లోకి అక్రమంగా పెట్టుబడులు వచ్చాయనే దిశలో విచారణ జరుగుతున్న దృష్ట్యా ఆ పత్రిక, టివి ఛానెల్కు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి మద్దతు ఇవ్వడం అనైతికమవుతుందని, అందుకే ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లోగా ఈ జివో ఎప్పుడైనా విడుదల కావొచ్చునని అంటున్నారు.
మరోవైపు ఉప ఎన్నికలకు ముందు సిబిఐ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే జగతిపై తదుపరి చర్యలు తీసుకోవాలని సిబిఐ భావిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications