పాలమురులో బిజెపి విన్: కోదండరామ్ వర్సెస్ కెసిఆర్

తాము సృష్టించిన జెఏసి తమకే మద్దతు ఇవ్వకుంటే ఎలా అని, ఈ క్రమంలో కెసిఆర్ తన తొలి టార్గెట్గా కోదండరాంనే పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ రెండు రోజుల క్రితం జెఏసిలో తమకు అనుకూలంగా వ్యవహరించే పలువురు జిల్లా బాధ్యులకు ఫోన్ చేశారని, కోదండరాంను తొలగించుదామని, ప్రతిపాదించినట్లు తెలుస్తోందని పేర్కొంది. ఆయన కావాలో తాము కావాలో తేల్చుకోవాలని ఒకింత సూటిగానే అన్నారట.
ఆయనే కావాలనుకుంటే తాము జెఏసి నుంచి బయటికి వెళ్తామని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. ఇటీవల తెరాస కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు జెఏసి, కోదండరాంపైన కెసిఆర్కు ఫిర్యాదులు చేశారు. జెఏసి సహకరించకపోవడం వల్లనే పాలమూరులో ఓడామని, దీనిపై దృష్టి సారించాలని కెసిఆర్కు వారు సూచించారు. అయితే దానిపై స్పందించేందుకు కోదండరామ్ అప్పుడు నిరాకరించారు. పార్టీలోని అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని, పార్టీ అంతిమంగా నిర్ణయం తీసుకున్నప్పుడు స్పందిస్తానని చెప్పారు.
గత ఏడాది జెఏసిలో చేపట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగానే కెసిఆర్, కోదండరాం మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని అంటున్నారు. ఆ తర్వాత కొంత సర్దుబాటు జరిగినప్పటికీ... పాలమూరు ఉప ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్, జెఏసిల మధ్య దూరం మరింత పెరిగింది. జెఏసి భాగస్వామ్య టిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండూ రంగంలో ఉండటంతో... జెఏసి రాష్ట్ర శాఖ తటస్థ వైఖరి తీసుకుంది. స్థానిక జెఏసి మాత్రం బిజెపి వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగింది.
ఈ కారణంగానే తాము అక్కడ ఓటమి పాలైనట్లు టిఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది. ఇదే విషయాన్ని కెసిఆర్ పార్టీ అంతర్గత సమావేశంలో ప్రస్తావించారు. శనివారం జరిగిన పార్టీ 11వ వార్షికోత్సవ ప్రతినిధుల సభలో ఆయన జెఏసి ఊసే ఎత్తలేదు. 9, 10 వార్షికోత్సవ సభలకు కోదండరాంను సౌహార్ద ప్రతినిధిగా ఆహ్వానించి ఆయనతో మాట్లాడించారు. జెఏసి గురించి గొప్పగా చెప్పారు. ఈసారి వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది.
తాము లేకపోతే జెఏసి లేదని ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. జేఏసీని ఏర్పాటు చేసిందే మేమేనని అని కుండబద్దలు కొట్టారు. తమ పార్టీ జెఏసిపై ఆధారపడి పుట్టింది కాదని తేల్చి చెప్పారు. కెసిఆర్ వ్యూహాత్మకంగానే కోదండరాంపై దాడికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. పాలమూరులో మాదిరిగానే పరకాల ఉప ఎన్నికల్లోనూ టిఆర్ఎస్, బిజెపి పరస్పరం ఢీకొనడం తథ్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోదండరాంను తమ దారికి తెచ్చుకోవడానికే కెసిఆర్ ఈ ఎత్తుగడ వేసినట్లుగా భావిస్తున్నారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాస, బిజెపి మినహా ఇతర భాగస్వామ్య పక్షాల ప్రతినిధులతో కోదండరాం సంప్రదింపులు జరుపుతున్నారట. తెరాస, బిజెపి వైఖరులపై జెఏసి ఎలా నడుచుకోవాలి, కాంగ్రెసు తెలంగాణ ఎంపీల విషయంలో ఏ వైఖరి తీసుకుందామని ఆయన చర్చిస్తున్నారట.












Click it and Unblock the Notifications