బాబు, హరికృష్ణ విభేదాలు, వైయస్ జగన్ ఆపరేషన్

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను వైయస్సార్ కాంగ్రెసు నాయకులు తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహరచన చేసి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీతో నడిరోడ్డు మీద చర్చలు జరపడంతో తెలుగుదేశం పార్టీలో కలవరం ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహితుడైన వంశీతో పాటు గుడివాడ తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు కొడాలి నానిని కూడా జగన్ తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్తో చర్చలు జరిపిన తర్వాత వంశీ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురై వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు మానసికంగా సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే, తనకు పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణలో జగన్పై కొన్ని సానుకూల వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీలో జగన్ పెట్టిన చిచ్చు వంశీ సంఘటనతోనే ప్రారంభం కాలేదని అంటున్నారు.
గతంలో గుంటూరు జిల్లాకు చెందన మాకినేని పెదరత్తయ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే, అక్కడ పొసగకపోవడంతో వెనక్కి వచ్చారు. లోకసభ స్థానం టికెట్ ఇస్తామంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుంటూరు జిల్లాకు చెందిన మరో కమ్మ నాయకుడికి ఫీలర్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ఇమేజ్ ఉన్న ఆ నాయకుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన ఇబ్బందులే ఎదురవుతాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం జిల్లా గద్దె బాబూరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కూతురు కూతురు, అల్లుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
ఇదిలా వుంటే, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుతో జగన్ సమావేశం కావడం తెలుగుదేశం పార్టీని తీవ్ర కలవరానికి గురి చేసిందని అంటున్నారు. మోహన్ బాబు కోడలు జగన్కు సోదరి అవుతుంది. కవలలను కన్న సోదరిని అభినందించేందుకు జగన్, ఆయన భార్య భారతితో కలిసి మోహన్ బాబు ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మోహన్ బాబుతో వైయస్ జగన్ రాజకీయ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు పార్టీకే కాకుండా వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీకి కూడా షాక్ ఇచ్చే పనికి పూనుకున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications