జగన్ తప్పు చేయలేదు: సాయి, ఇక రాజకీయాల్లోకి

తాను, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అంతిమ విజయం మంచికే ఉంటుందని, తమకు విజయం సిద్ధిస్తుందని చెప్పారు. తాను ఎలాంటి బోగస్ కంపెనీలను సృష్టించలేదని చెప్పారు. తాను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా పని చేశానని, అది నా ప్రొఫెషన్ అందించిన వరం అన్నారు.
అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అది భగవంతుడి ఆశీస్సులతో వచ్చిందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి తాను మేలు చేసినందుకే పదవులు వరించాయనేది అవాస్తవమని చెప్పారు. తనకు రెండోసారి బెయిల్ మంజూరు చేసినందుకు న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు.
న్యాయవ్యస్థలో తనకు ఎలాంటి అన్యాయం జరగదనే సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ తన బాధ్యతలను తాను నిర్వర్తిస్తోందని అన్నారు. జైలు జీవితం సంతోషదాయకమైనదేమీ కాదని, అయితే తాను ఆ సమయాన్ని పుస్తక పఠనం కోసం వినియోగించానని చెప్పారు. తన కేసును స్టడీ చేశానని, న్యాయపోరాటం చేసేందుకు వీలయిందన్నారు. ఆస్తుల కేసు రాజకీయంగా ఆలోచిస్తే ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న పోరాటం అన్నారు.
ధర్మం, న్యాయం మా వైపు ఉందని, విజయం సాధిస్తామని చెప్పారు. అరెస్టుల విషయంలో సిబిఐ తీరును తాను తప్పు పట్టడం లేదన్నారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలు తన కర్మ ఫలం వల్ల వచ్చినవని, జగన్ కుటుంబం వల్ల వచ్చినవి కావన్నారు. జగన్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం శాశ్వతమైనదని, ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. తన భవిష్యత్తుపై జగన్తో మాట్లాడి నిర్ణయించుకుంటానని చెప్పారు. జగన్తో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తాను రాజకీయాల్లోకి వస్తానా రానా అనే అంశంపై మాట్లాడలేనని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను బట్టి రాజకీయాల్లోకి రానున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ అడిగిన ప్రతి ప్రశ్నకు తాను సమాధానం చెప్పానన్నారు. జైలులో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలు చూశానని అన్నారు. ఖైదీలకు చెందాల్సిన కొన్ని న్యాయపరమైన వాటి కోసం పోరాటం చేస్తానని చెప్పారు.
కాగా విజయ సాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం మరోసారి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ను సోమవారం మంజూరు చేసింది. ఇంతకు ముందు సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. దాంతో విజయ సాయి రెడ్డి లొంగిపోయి మరోసారి సిబిఐ కోర్టులో బెయిల్కు పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
దీనిపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని విజయసాయి రెడ్డిని ఆదేశించింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు విజయ సాయి రెడ్డిని ఆదేశించింది. అలాగే, సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని కూడా ఆదేశించింది. బెయిల్ కోసం ఇద్దరు వ్యక్తులతో 25 వేల రూపాయలేసి వ్యక్తిగత పూచీకత్తు ఇప్పించాలని కోర్టు విజయ సాయి రెడ్డిని ఆదేశించింది.
అయితే, విజయసాయి రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ అమలును మూడు రోజుల పాటు ఆపాలని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. వైయస్ జగన్ సంస్థలకు విజయసాయి రెడ్డి కేవలం ఆడిటర్గా మాత్రమే వ్యవహరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదించగా, వైయస్ జగన్తో కలిసి విజయ సాయి రెడ్డి కుట్ర చేశారని సిబిఐ వాదించింది.
విజయ సాయి రెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ కోర్టు ఏప్రిల్ 20వ తేదీన హైకోర్టు తీర్పును ఇచ్చింది. సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. దీంతో విజయసాయి రెడ్డి 23వ తేదీన కోర్టులో లొంగిపోయారు. ఏప్రిల్ 13వ తేదీన విజయ సాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు మొదటిసారి బెయిల్ లభించింది. విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్ను మరోసారి హైకోర్టులో సవాల్ చేసేందుకు సిబిఐ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి రెండో నిందితుడు. వైయస్ జగన్ రెండో నిందితుడు. విజయసాయి రెడ్డిపై అభియోగాలు మోపుతూ సిబిఐ కోర్టులు చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు సిబిఐ విజయసాయి రెడ్డిని మాత్రమే అరెస్టు చేసింది. విజయసాయి రెడ్డిని జనవరి 2వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications