ఇదేం లిస్ట్?: సోనియా ప్రశ్న, నీళ్లు నమిలిన బొత్స, కిరణ్

అభ్యర్థులపై సోనియా గాంధీ వేసిన ప్రశ్నలకు బొత్స, కిరణ్ నీళ్లు నమిలారని అంటున్నారు. పలువురు అభ్యర్థులపై పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం స్థానిక నేతలతో సంప్రదింపులు కూడా జరిపిందని అంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు లోకసభ స్థానంతో పాటు నరసన్నపేట, నరసాపురం, రామచంద్రాపురం, ఒంగోలు, ఉదయగిరి, రాయదుర్గం, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
మిగిలిన పలు నియోజకవర్గాలలో అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు ఉండటం, కొందరికి పట్టు లేక పోవడం తదితరాల దృష్ట్యా అధిష్టానం వాటిపై దృష్టి సారించిందని అంటున్నారు. పరకాల, పోలవరం, రాయచోటి తదితర నాలుగు మినహా కిరణ్, బొత్సలు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను అధిష్టానం ముందు పక్కాగా ఉంచారు. అయితే ఆ నాలుగింటితో పాటు అధిష్టానం మరికొన్నింటి పైనా తన అసంతృప్తిని ప్రకటించినట్లుగా కనిపిస్తోంది.
దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చిందని అంటున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం వరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముగుస్తుందనుకున్నప్పటికీ ఆ లోగా తేలే అవకాశం లేదని అంటున్నారు. కాగా అభ్యర్థుల ఖరారు కోసం ముఖ్యమంత్రి ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, నంది ఎల్లయ్య, జెడి శీలం, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కావూరి సాంబశివ రావు, కేంద్రమంత్రి పల్లం రాజు తదితరులతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications