అసంతృప్తుల సెగ: జగన్ను ఎదుర్కోవడం సాధ్యమా?

అయితే ఆయా నియోజకవర్గాలలోని విభేదాలు పార్టీని ఉప ఎన్నికలలో దెబ్బతీస్తాయేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. టిక్కెట్ ఆశించిన భంగపడిన నేతలు, జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఇలా పార్టీలోని పలు అంశాలు ముఖ్య నేతలలో గెలుపుపై ఆశలు సన్నగిల్లేలా చేస్తున్నాయని అంటున్నారు. పార్టీకి, చిరంజీవికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తిరుపతి టిక్కెట్ తన తనయుడు గల్లా జయదేవ్కు రాకపోడంపై మంత్రి గల్లా అరుణ కుమారి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో చిరంజీవికి సహకరించకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కడప జిల్లాలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఓ వైపు ఉండగా అహ్మదుల్లా, వీర శివా రెడ్డి మరోవైపు ఉన్నారు. డిఎల్ నిత్యం సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. దీంతో జగన్ సొంత జిల్లాలో పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని అంటున్నారు. అక్కడ గెలుపు ఏమో కానీ డిపాజిట్ కూడా కష్టమేననే అభిప్రాయానికి కాంగ్రెసు నేతలు వచ్చారని తెలుస్తోంది. అక్కడి నేతలను సమన్వయ పర్చడం ఈజీగా కుదిరే పని కాదని భావిస్తున్నారట.
డిఎల్ రవీంద్రా రెడ్డి ఇప్పటికే తాను ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను తీసుకోనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వర్గాల మధ్య విభేదాలు గెలుపుపై ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మంత్రి ధర్మాన ప్రసాద రావు తోటి మంత్రి, అదే జిల్లాకు చెందిన కొండ్రు మురళీ మోహన్ను ఉప ఎన్నికల ప్రచారానికి వద్దంటున్నారట.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై కొండ్రు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండ్రు ప్రచారానికి వస్తే మొదటికే మోసం వస్తుందని ధర్మాన భావిస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న టి.సుబ్బిరామి రెడ్డికి ఆ జిల్లాకు చెందిన ఆనం సోదరుల మద్దతు ఉండక పోవచ్చుననే అనుమానాలు తలెత్తుతున్నాయి. నెల్లూరు ఎంపీగా వివేకాను గెలిపించుకొని జిల్లాలో మరింత పట్టు సాధించుకోవాలని ఆనం సోదరులు భావించారు.
అయితే అనూహ్యంగా అధిష్టానం టిఎస్సార్ను రంగంలోకి దింపింది. దీంతో వారు ఆయనకు సహకరిస్తారా లేదా అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది. అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారానికి సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలె ఆయన జిల్లాకు చెందిన కార్యవర్గంలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక పార్టీ అభ్యర్థుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఇప్పటికే పలువురు తమ ఆగ్రహాన్ని బాహాటంగానే చూపించారు. పరకాల టిక్కెట్ ఇవ్వనందుకు గండ్ర వెంకట రమణ, పాయకరావుపేటకు తనను విస్మరించారని విజయరావు ఇప్పటికే పార్టీపై కత్తులు నూరుతున్నారు. వారి మద్దతుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిఆర్పీ క్యాడర్కు కాంగ్రెసుతో ఇప్పటి వరకు చాలా చోట్ల సమన్వయం కుదరకపోవడం ఉప ఎన్నికలలో నష్టపరుస్తాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications