Silver: వెండిపై కేంద్రం ఆంక్షలు-తక్షణం అమల్లోకి ఉత్తర్వులు..!
అమెరికా-ఇరాన్ యుద్దాన్ని కారణంగా చూపుతూ విలువైన లోహాలు బంగారం, వెండి వాడకాన్ని, కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతుల విషయంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై వెండి కడ్డీలు (Silver bars)కొనాలనుకునే వారికి షాక్ తగలబోతోంది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయి.
పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో కొన్ని రకాల వెండి కడ్డీల దిగుమతిపై ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు విధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ జారీ చేసింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన సవరించిన దిగుమతి విధానం ప్రకారం, ITC(HS) 2022 వర్గీకరణలోని చాప్టర్ 71 కింద 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలను "ఫ్రీ" కేటగిరీ నుండి ఆంక్షల కేటగిరీకి మార్చారు. ఇతర నిర్దిష్ట వెండి కడ్డీలను కూడా ఈ పరిమిత దిగుమతి కేటగిరీకి మార్చారు. ఈ వెండి రకాల దిగుమతులు ఇకపై చాప్టర్ 71లోని పాలసీ కండిషన్ నెం.7కు లోబడి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. దేశంలోకి వెండి దిగుమతుల పర్యవేక్షణ, నియంత్రణను బలోపేతం చేయడమే ఈ చర్య లక్ష్యమని పేర్కొంది.

సవరించిన వెండి దిగుమతి నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయని డీజీఎఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఒక రోజు ముందు, ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. అడ్వాన్స్ ఆథరైజేషన్ పథకం కింద బంగారం దిగుమతులపై 100 కిలోల పరిమితిని కూడా విధించింది. ఈ పథకం ఆభరణాల ఎగుమతిదారులకు ముడి పదార్థాలు లేదా ముడి సరుకును సున్నా సుంకంతో దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తుంది. బంగారం దిగుమతుల కోసం ముందస్తు అనుమతి జారీ చేయడం, పర్యవేక్షించడం వంటి నిబంధనలను కూడా ప్రభుత్వం కఠినతరం చేసింది. గతంలో ఈ పథకం కింద బంగారం దిగుమతిపై ఎలాంటి పరిమితులు లేవు.












Click it and Unblock the Notifications