కాంగ్రెస్, బిజెపిపై కెసిఆర్ వ్యూహం బెడిసి కొట్టిందా?

ఉప ఎన్నికల కోసం సభ నుండి బహిష్కరింప చేసుకునేందుకు కెసిఆర్ వ్యూహరచన చేశారని, కానీ అది బెడిసి కొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొదట కెసిఆర్ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలపై ఆయన తన వ్యూహాన్ని అమలు చేశారట. ఇటీవల తెలంగాణ ప్రాంత ఎంపీలను లక్ష్యంగా చేసుకొని కెసిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో సస్పెన్షన్కు గురైన తర్వాత కూడా ఇంకా ఆ పార్టీలో ఎలా ఉంటున్నారని, విడిచి తమతో కలిసి ఉద్యమించాలని సూచించారు.
అయితే అంతకుముందు టిఆర్ఎస్ బహిష్కరణకు గురైనందుకు వారికి అండగా నిలిచింది. ఎంపీలను బహిష్కరించి కాంగ్రెసు తెలంగాణను అవమానపర్చిందని మండిపడింది. ఎంపీలకు కితాబిచ్చింది. కానీ ఆ తర్వాత కెసిఆర్ వారిపై ధ్వజమెత్తారు. అయితే సభలో తమతో కలిసి వస్తే ఇరువురు కలిసి సభను అడ్డుకునే ప్రయత్నంలో తమపై బహిష్కరణ వేటు పడుతుందని కెసిఆర్ భావించారని అంటున్నారు. కానీ కాంగ్రెస్ ఎంపీలు వారితో కలిసి రాలేదు.
అది అలా ఉంటే సభలో భారతీయ జనతా పార్టీ ఎప్పటి లాగే తమ ఆందోళనకు మద్దతిస్తుందని కెసిఆర్ భావించారట. కానీ తెరాస ఆందోళనకు బిజెపి మద్దతివ్వలేదు. పాలమూరు ఉప ఎన్నికల తర్వాత పరకాలపై వచ్చిన విభేదాలు పార్టీ అధిష్టానానికి చేరిన కారణంగా కెసిఆర్, విజయశాంతిలకు వారు తమ మద్దతు తెలపలేదని అంటున్నారు. దీంతో చేసేది లేక కెసిఆర్ ఇక తాము సభకు వెళ్లమని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి రాష్ట్రానికి వచ్చారని అంటున్నారు.












Click it and Unblock the Notifications