చిత్తశుద్ధి, నిజాయితీలో నాకెవరూ సాటి లేరు!: చిరంజీవి

తిరుపతి అభివృద్ధికి రూపొందించిన రూ.405 కోట్ల బ్లూ ప్రింట్ పూర్తిగా అమలైతే నగర రూపురేఖలు మారిపోతాయన్నారు. అసాంఘిక శక్తులు, తిరుపతి పవిత్రతను మంటగలిపారన్నారు. మళ్లీ ఇక్కడ తిష్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారని, వారికి స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు లేని చిత్తశుద్ధి తనకుందని చెప్పారు.
తాను శాసనసభ్యుడిగా ఉన్న మూడేళ్ల కాలంలో తిరుపతిలో శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగలేదన్నారు. ఇలాంటి చక్కటి వాతావరణం వెల్లివిరిసిందన్నారు. అవినీతి, భూదందాల వంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అయితే అసాంఘిక శక్తులు పవిత్రతను మంటగలిపే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
అధిష్టానం ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించాల్సి వచ్చిందన్నారు. ఈ పదవి ద్వారా తిరుపతిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ఉప ఎన్నికల్లో తిరుపతి ఇన్చార్జి మంత్రి పార్థసారథి మాట్లాడుతూ... పచ్చి అబద్ధాలు చెప్పడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దిట్ట అని, ప్రభుత్వంపై అతని దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వచ్చమైన పాలన వెంకట రమణను గెలిపిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ.. చిరంజీవి మచ్చలేని నేత అన్నారు. ఆయన నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు. కాగా ఎన్నికలు జరగబోతున్న నియోజకవర్గాలన్నింటిలోనూ చిరంజీవి సన్నాహాక సమావేశాలు నిర్వహించబోతురున్నారు.












Click it and Unblock the Notifications