APSRTC ప్రైవేటీకరణపై తేల్చేసిన ఛైర్మన్ కొనకళ్ల..! టికెట్ రేట్ల పెంపుపై క్లారిటీ..!
ఏపీలో ఆర్టీసీ (APSRTC) ప్రైవేటీకరణపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై స్పష్టత వచ్చేసింది. ఇవాళ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోళ్ల తర్వాత ప్రైవేటీకరణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు ఇప్పటికే నిరసనలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఛైర్మన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఏపీ ఆర్టీసీలో ప్రైవేటీకరణ తప్పనిసరి అని సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తేల్చిచెప్పేశారు. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా ఆయన వెల్లడించారు. కేంద్రం సబ్సిడీ ఇస్తోందని, ఒక్కో బస్సుకు కోటీ 70 లక్షల వరకూ దీనిపై పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని, ఇది ప్రభుత్వానికి సాధ్యం కాదని, అందుకే ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తే వాళ్లు కొనుగోలు చేసి నిర్వహిస్తారని కొనకళ్ల వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న బస్సుల్ని చూసుకుంటే రూ.15 వేల కోట్లు అవుతుందన్నారు. ఆర్టీసీకి అంత స్తోమత లేదన్నారు.

ఏపీ ఆర్టీసీలో ప్రైవేటీకరణ తప్పని సరి
— Telugu Feed (@Telugufeedsite) May 16, 2026
ప్రైవేటీకరణపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సంచలన వ్యాఖ్యలు
విద్యుత్ బస్సులు కొనుగోలు, నిర్వహణ ప్రభుత్వానికి సాధ్యం కాదన్న చైర్మన్
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం pic.twitter.com/mVL9K3OE4P
ప్రస్తుతం ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీపై భారం పెరిగిందన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో విద్యుత్ బస్సుల్ని ప్రభుత్వం కొనడం సాధ్యం కాని పని అని తేల్చేశారు. అందుకే ప్రైవేటుకు దీన్ని అప్పగిస్తున్నట్లు తెలిపారు. మామూలు బస్సుల స్ధానంలో విద్యుత్ బస్సులు ప్రవేశపెడితే ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరల ప్రభావం ఆర్టీసీపై ఉండదన్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీ టికెట్ల ధరలు పెంచే అవకాశం లేదన్నారు. విద్యుత్ బస్సు అయితే కిలోమీటరుకు రూ.7 ఖర్చవుతుంటే, డీజిల్ బస్సు వల్ల రూ.16 అవుతుందన్నారు. విద్యుత్ బస్సుల రాకతో ఆర్టీసీపై భారం తగ్గుతుందన్నారు. ప్రస్తుతానికి 750 బస్సులకు టెండర్లు ఆమోదించామని, ఇప్పటికే వాటికి విద్యుత్ స్టేషన్ల ఏర్పాటు కూడా పూర్తయిందన్నారు. రెండు నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications