వైయస్ చేసిన మంచిని కిరణ్ చెప్పుకుంటున్నారు: జగన్

ఆయన శనివారం రాయచోటిలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 2004 ఎన్నికలకు ముందు చాలామంది ముఖ్యమంత్రులు పని చేశారని, ఆ సమయంలో ఓ రోజు తాను తన తండ్రి వైయస్తో రాయచోటికి వచ్చి, అక్కడి నీళ్ల సమస్యను చూసి త్వరలో సువర్ణయుగం వస్తుందని మాట ఇచ్చానని, మీ బాధలు తీరిపోతాయని చెప్పానని, అన్నట్లే వైయస్ సువర్ణయుగం తెచ్చారన్నారు.
రూ.220 కోట్లతో వెలిగల్లు ప్రాజెక్టును వైయస్ నిర్మిస్తే ఆయన చనిపోయాక ఆ ప్రాజెక్టు శిలాఫలకం మీద తన పేరు వేయించుకొని ప్రారంభోత్సవం చేశారన్నారు. శిలాఫలకంపై వైయస్ పేరు ఎక్కడా లేదన్నారు. వైయస్ చేసిన మంచి పనులను కూడా ఆయనకు దక్కకుండా చేస్తున్నారన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ప్రజా సమస్యలు పట్టవన్నారు. వైయస్ను విమర్శించడమే వారి లక్ష్యమన్నారు.
ప్రజల సమస్యలను ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల ఇళ్లలో కరెంటు పోతున్నా నేతలు మాత్రం మాకు నష్టం జరగట్లేదు కదా అనుకుంటున్నారన్నారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసినందుకే తన వర్గానికి చెందిన పదిహేడు మంది నేతలపై వేటు పడిందన్నారు.
తెలుగుదేశం పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు తన వర్గం ఎమ్మెల్యేలతో తాను... రాజకీయాల్లో పదవులు ఉంటాయి పోతాయి కానీ నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలి అంటే ఈయనే మా నాయకుడు అని ప్రతి కార్యకర్త తలెత్తుకుని తిరిగేలా ఉండాలని చెప్పానన్నారు. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు ఎలా బతికామన్నది ముఖ్యమని తాను వాళ్లతో చెప్పానన్నారు.












Click it and Unblock the Notifications