NEET పేపర్ లీక్ కేసు: కీలక సూత్రధారి అరెస్ట్..
2026 NEET-UG ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ శనివారం.. జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) పేపర్ సెట్టింగ్ కమిటీ సభ్యురాలు మనీషా మంధారేను దిల్లీలో సీబీఐ అరెస్టు చేసింది. మే 3న జరిగిన ఈ పరీక్ష లీకేజీకి ఆమె ప్రధాన సూత్రధారి అని అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు పీవీ కులకర్ణి విచారణ ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు.
పూణేలోని మోడరన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్లో బోటనీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మనీషా మంధారేను సీబీఐ "NEET-UG 2026 జీవశాస్త్ర ప్రశ్నల లీకేజీకి మూలం, మరో మాస్టర్మైండ్" గా గుర్తించింది. పీవీ కులకర్ణి, ఇతర నిందితుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా.. మంధారేను సీబీఐ ప్రధాన కార్యాలయం విచారణ అనంతరం అరెస్టు చేశారు. విద్యా సంస్థ వర్గాల ప్రకారం.. మంధారే గత ఐదారేళ్లుగా NTA తరపున NEET ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు.
NTA ఆమెను నిపుణురాలిగా నియమించడంతో బోటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలపై ఆమెకు పూర్తి ప్రాధాన్యం ఉందని సీబీఐ తెలిపింది. 2026 ఏప్రిల్లో పూణేలో నిర్వహించిన రహస్య కోచింగ్ తరగతుల్లో ఆమె కొన్ని NEET ప్రశ్నలను లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. లీక్ చేసిన ప్రశ్నలు.. వాటి సమాధానాలను మంధారే డిక్టేట్ చేసి, అందుకు లక్షల రూపాయలను ఫీజుగా వసూలు చేసినట్లు కేంద్ర ఏజెన్సీ పేర్కొంది.
"ఈ తరగతుల్లో ఆమె బోటనీ, జువాలజీ సబ్జెక్ట్ లకు సంబంధించిన వివిధ ప్రశ్నలను వివరించి.. వెల్లడించింది. విద్యార్థులతో వాటిని వారి నోట్ బుక్ లలో రాయమని పాఠ్యపుస్తకాలలో గుర్తించమని చెప్పింది" అని సీబీఐ నివేదించింది. దర్యాప్తు సంస్థ ప్రకారం.. ఈ ప్రశ్నలలో చాలా వరకు మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన వాటితో సరిపోయాయి. ఈ ప్రత్యేక కోచింగ్ సెషన్ల కోసం అభ్యర్థులను సమీకరించడంలో మంధారేకు, మే 14న అరెస్టు చేసిన మరో నిందితురాలు మనీషా వాగ్మారే సహాయం చేసిందని సీబీఐ వివరించింది.
మంధారే పాత్రను గురించి స్పష్టం చేస్తూ "2026 ఏప్రిల్ నెలలో, ఆమె పూణేకు చెందిన మనీషా వాగ్మారే (మే 14, 2026న ఇప్పటికే అరెస్టు చేయబడింది) ద్వారా సంభావ్య NEET పరీక్ష అభ్యర్థులను సమీకరించి.. తన పూణే నివాసంలో ఈ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించింది," అని సీబీఐ వెల్లడించింది. మంధారే ఉపయోగించిన పద్ధతి మాదిరిగానే, పదవీ విరమణ పొందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్, ప్రధాన నిందితుడు పీవీ కులకర్ణి కూడా రసాయనశాస్త్రం ప్రశ్నలను లీక్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆయన చాలా ఏళ్లుగా NTA ప్రశ్నాపత్రాలను రూపొందించే కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. కులకర్ణిని సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. కులకర్ణికి కూడా NEET అభ్యర్థులను సమీకరించడంలో వాగ్మారే సాయపడింది. అరెస్టుల అనంతరం, పీవీ కులకర్ణి, మనీషా వాగ్మారేలను శనివారం దిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులోని పెద్ద కుట్రను ఛేదించడానికి నిందితులను వివిధ ప్రాంతాలకు విచారణ నిమిత్తం తీసుకెళ్లాల్సి వస్తుందని CBI 14 రోజుల కస్టడీ కోరింది. దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఈ కేసులో పూణే, ఢిల్లీ, జైపూర్, గురు గ్రామ్లతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 9 మందిని అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications