భానుతో లింక్స్, అవి రాయరేం: రామోజీపై జగన్ ఫైర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివీ 9 కాంగ్రెసుతో కుమ్మక్కయి నీచ రాజకీయాలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఆ భాను అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఆదివారం రోడ్షో నిర్వహించారు. చంద్రబాబు రాత్రి వేళ వెళ్లి చిదంబరాన్ని కలుస్తారని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తారని ఆయన అన్నారు. చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు చెందిన జిఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాదు నడిబొడ్డున అమీర్పేటలో ఐదెకరాల స్థలం కాంగ్రెసు పెద్దలే దారాదత్తం చేశారని జగన్ ఆరోపించారు
భానుకిరణ్, మంగలి కృష్ణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ చెప్పారు. భాను, కృష్ణల వ్యవహారాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని పదే పదే చెప్పుకొచ్చారు. ప్రజలు సుఖపడాలని పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయిస్తే దివంగత నేత వైఎస్ను సీబీఐ నిందితుడిగా పేర్కొనడం బాధాకరమని, సీబీఐ పక్షపాతంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు సీబీఐకి కనపడవా? అని ప్రశ్నించారు.
కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని చెప్పడానికి పలు నిదర్సనాలు ఉన్నాయని ఆయన అన్నారు. సిబిఐ ఈ రోజు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని తప్పు పడుతోందని ఆయన అన్నారు. ఎమ్మార్ కేసులో సిబిఐకి చంద్రబాబు చేసిన తప్పు కనపడడం లేదని ఆయన అన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబుతో పాటు కొన్ని మీడియా సంస్థలు తనపైనా, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపైనా బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications