జగన్ చుట్టూ ఉచ్చు: మీడియా ఖాతాల స్తంభన
సాక్షికి సంబంధించి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) ఖాతాలను, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రాకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. ఈ పరిణామం నేపథ్యంలో సాక్షి యాజమాన్యం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఖాతాల స్తంభనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సాక్షి దినపత్రికను ఆపించాలనే దురుద్దేశంతోనే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చాలా వేగంగా ముందుకు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్ జగన్ను సిబిఐ దర్యాప్తు కష్టాలు ముట్టడిస్తున్నాయి. కోర్టు జగన్కు సమన్లు జారీ చేయడం, మీడియా సంస్థల ఖాతాలను స్తంభింపజేయడం వంటి పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆందోళన చోటు చేసుకుంది. జగన్ ఆస్తుల జప్తునకు సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొందేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 28వ తేదీన వైయస్ జగన్ను అరెస్టు చేస్తారా అనే అనుమానాలు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అలుముకున్నాయి. ఆ రోజు జగన్ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ కోర్టుకు హాజరు కాకపోతే, కోర్టు జగన్ అరెస్టుకు వారంట్ జారీ అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ తీరిక లేకుండా తిరుగుతున్నారు.