రష్యన్ సూపర్జెట్ ప్లేన్ అదృశ్యం, జావా దీవిలో శకలాలు
ఇది ఇండోనేసియాలో ప్రమోషనల్ టూర్ కోసం వెళ్లింది. ఈ విమానం తొలి ప్రయాణం బుధవారమే అంతా సాఫీగా జరిగినా రెండోసారి మాత్రం తప్పిపోయింది. ఇండోనేసియా రాజధాని జకార్తాకు దక్షిణదిశగా సహాయ బృందాలు బయల్దేరినట్లు ఇండోనేసియా రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి బంబాంగ్ ఎర్వాన్ తెలిపారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో రెండు హెలికాప్టర్లు వెనక్కి వచ్చాయి. సుఖోయ్ సూపర్జెట్-100 విమానం జకార్తాలోని హలీమ్ పెర్డనకుసుమ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.21కి టేకాఫ్ తీసుకుంది.
అయితే పైకి ఎగిరిన 21 నిమిషాలకే అది సలాక్ పర్వత శ్రేణి వద్ద రాడార్తో సంబంధాలు కోల్పోయింది. పదివేల అడుగుల ఎత్తు నుంచి ఆరు వేల అడుగుల ఎత్తుకు వెళ్తామని విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను అనుమతి కోరిన కాసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయానికి చిరుజల్లులు పడుతున్నా వాతావరణం మరీ అంత ఇబ్బందికరంగా లేదు. ఓ పెద్ద విమానం తమ ఇంటి మీదుగా వెళ్తుండగా చూసినట్లు జువాండా అనే గ్రామస్తురాలు స్థానిక స్టేషన్ టీవీ వన్కు తెలిపారు.
ఆమె దాదాపు 7,200 అడుగుల ఎత్తున్న కొండకు సమీపంలో ఉంటారు. అది ఒకపక్కగా ఒరుగుతోందని, ఇంజన్ కూడా ఏదో శబ్దం చేస్తోందని, సలాక్ వైపు వెళ్తున్నట్లు కనపడినా, ఎక్కడా పేలినట్లు మాత్రం వినిపించలేదని చెప్పారు. వాయుమార్గంలో సహా య చర్యలు సాయంత్రానికే నిలిచిపోయినా, పోలీసులు, వైమానిక దళ సిబ్బంది మాత్రం సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.
కాగా బుధవారం అదృశ్యమైన సుపర్ జెట్ -100 విమానం ఆచూకిని గురువారం ఉదయం గుర్తించారు. జావా దీవిలో విమానం శకలాలు కనిపించాయి. విమానంలో ప్రయాణించిన 48 మంది మృతి చెందారు. బుధవారం అదృశ్యమైనప్పటి నుండి దీని కోసం అధికారులు తీవ్రంగా వెతికారు.