ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, అరగుండు శిక్ష

ఉప్పలమ్మకు ఇతరులతో వివాహేతర సంబంధాలు ఏర్పడ్డాయి. ఇది తెలిసిన ఎర్రయ్య ఆమెను పలుమార్లు మందలించాడు. భర్త మందలింపుతో ఆమెలో మార్పు రాలేదు. సరికదా భర్తపై కోపం పెంచుకుంది. తన వివాహేతర సంబంధానికి నిత్యం అడ్డు చెబుతున్న భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. గురువారం రాత్రి ఎర్రయ్య నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడిని పిలిపించి, అతని సహాయంతో భర్త గొంతు నులిమి చంపేసింది.
ఈ విషయం ఉదయం గ్రామస్తులకు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ మహిళలు, ఆమెను నడి రోడ్డు పైకి లాక్కొచ్చి కర్రలతో చితకబాదారు. కంట్లో కారంపొడి కొట్టారు. ఆ తర్వాత అరగుండు గీసి, ఊరేగించారు. రాత్రి ఇద్దరు ఆటోలో వచ్చినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే వచ్చిన ఇద్దరూ ఆమెకు సహకరించారా లేక ప్రియుడు ఒక్కడే సహకరించాడా తెలియరాలేదు.
ఉప్పలమ్మకు ఇతరులతో వివాహేతర సంబంధముందని, తీరు మార్చుకోమని తాము గతంలో పలుమార్లు చెప్పామని, పంచాయతీ కూడా పెట్టామని గ్రామస్తులు చెబుతున్నారు. అయినా ఆమె తన తీరు మార్చుకోలేదన్నారు. ఇతరులతో సంబంధాలు సరికాదని, కావాలంటే విడాకులు తీసుకోమని కూడా గ్రామస్థులు పంచాయతీలో సూచించారట.
కానీ ఉప్పలమ్మ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన భర్త తనను వదిలించుకుందామన్న ఉద్దేశ్యంతోనే తన పైన అభాండాలు వేస్తున్నాడని పంచాయతీలో చెప్పేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కూడా పంచాయతీ పెట్టారని తెలుస్తోంది. అయినా ఆమె తీరు మార్చుకోలేదని అంటున్నారు.
కాగా తన భర్త పెట్టే హింస భరించలేక తాను హత్య చేసినట్లుగా నిందితురాలు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా సమాచారం. నిందితురాలు భర్తను హత్య చేసినప్పటికీ, గ్రామస్తులు ఆమెపై దాడి చేయడం చట్టపరంగా సరికాదని, వారిపై చర్య తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications