ఉప పోరు: చిరంజీవి వర్సెస్ వైయస్ జగన్

Chiranjeevi-YS Jagan
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉప ఎన్నికల పోరు కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మధ్య సమరంగా మారినట్లే కనిపిస్తోంది. చిరంజీవి వైయస్ జగన్‌పై విమర్శల విషయంలో దూకుడు పెంచారు. అదే సమయంలో వైయస్ జగన్ తన తిరుపతి పర్యటనలో మొత్తం చిరంజీవిపైనే గురి పెట్టారు. చిరంజీవి వైయస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

జగన్‌ను దీటుగా ఎదుర్కోవాలని కాంగ్రెసు అధిష్టానం చిరంజీవికి సూచన చేసినట్లు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతను అధిష్టానం చిరంజీవి మీద పెట్టినట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు నడవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వారిద్దరు కూడా వైయస్ జగన్‌పై విమర్శల దాడి పెంచారు.

ఒక రకంగా 2014లో జరిగే సాధారణ ఎన్నికలు వైయస్ జగన్, చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే పోటీలోకి దిగనున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగానే రంగంలో ఉంటారు. వచ్చే ఎన్నికలు ముఖ్యమంత్రి అభ్యర్థుల పోరుగా ముందుకు రావడానికి ఇప్పుడే రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తనకు పోటీకి కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని తెచ్చిందనే విషయాన్ని జగన్ బాహాటంగానే అన్నారు. అందువల్ల చిరంజీవిపై దాడి పెంచే వ్యూహాన్ని వైయస్సార్ కాంగ్రెసు అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం వైయస్ భౌతిక కాయం అక్కడ ఉండగానే జగన్ సంతకాల సేకరణ జరిపించారని, తన వద్దకు మనుషులను కూడా పంపించారని చిరంజీవి ఘాటుగా విమర్శిస్తున్నారు. గతంలో కన్నా సూటిగా చిరంజీవి ఇప్పుడు మాట్లాడుతున్నారు.

ముఖ్యమంత్రి పీఠంపైనే జగన్ కన్నేశారని అంటూ ఆయనపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చెన్నైలోని తన పెద్ద కూతురు నివాసంలో ఐటి అధికారులకు లభించిన సొమ్ముపై సాక్షి టీవీ ప్రసారం చేసిన వార్తాకథనంపై చిరంజీవి ఏకధాటిగా జగన్‌పై విమర్శలు కురిపించారు. జగన్ అవినీతి గురించి ప్రస్తావించారు. వ్యక్తిత్వ హననానికి సాక్షి టీవీ చానెల్ నడుం బిగించిందని ఆయన అన్నారు.

అయితే, పెద్ద కూతురు ఇంట్లో ఐటి అధికారులకు దొరికిన సొమ్ముపై వివరణ ఇచ్చినా, పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించినా వైయస్సార్ కాంగ్రెసు నాయకులు చిరంజీవిపై విమర్శల దాడిని ఆపలేదు. ఐటి శాఖకు దొరికిన 35 కోట్ల రూపాయలు చిరంజీవివేనని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు విమర్శలు చేస్తున్నారు. వైయస్ జగన్ తనకు దీటుగా చిరంజీవి ముందుకు వస్తున్నారనే ఉద్దేశంతో ఉన్నట్లు, అందువల్లనే చిరంజీవిని లక్ష్యం చేసుకుని దాడులు పెంచినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+