వైయస్ జగన్కు సమన్లు అందజేసిన సిబిఐ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని చెన్నకేశవ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు జగన్ను కలిశారు. అక్కడే ఆయనకు సమన్లు అందజేశారు. ఆస్తుల కేసులో ఈ నెల 28వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు తమ ముందు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వ్యక్తిగతంగానే సిబిఐ సమన్లు అందజేస్తోంది. తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని వైయస్ జగన్ ఇటీవల జాతీయ మీడియాతో చెప్పారు.
జగన్ ఆస్తుల కేసులో అతనికి సమన్లు ఇవ్వడానికి సిబిఐ బృందం ఆదివారంనాడే కర్నూలు జిల్లాకు వెళ్లారు. వైయస్ జగన్ ప్రస్తుతం జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రచారంలో బిజీబిజీగా ఉండటంతో సమన్లను నేరుగా ఆయనకు ఇచ్చేందుకు కర్నూలు వెళ్లారు. సమన్లపై హైదరాబాదులోని లోటస్పాండు చిరునామా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అందజేయాలనే ఉద్దేశంతో సిబిఐ అధికారులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు వెళ్లారు.
ఆదివారం ఆయన ప్రజల మధ్య ఉండడంతో సిబిఐ అధికారులు సమన్లు అందజేయడానికి వెనకాడినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం సాధారణ వ్యక్తుల మాదిరిగా చెన్నకేశవ రెడ్డి నివాసానికి వెళ్లి, జగన్కు సమన్లు అందజేశారు. ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి తదితరులకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆస్తుల కేసు విషయంలో ఈ నెల 28వ తేదిన కోర్టుకు రావాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications