జగన్ కేసులో సమన్లు అక్రమం: సాయి రెడ్డి పిటిషన్
సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి, అన్ని చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాతనే కోర్టు విచారణ ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని గానీ, అయిపోయిందని గానీ సిబిఐ చెప్పడం లేదని, దర్యాప్తు పూర్తయ్యేంత వరకు వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారణను ఆపేయాలని ఆయన అన్నారు.
సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేస్తూ పోతుంటే, ప్రతి చార్జిషీట్ విచారణకు నిందితులకు సమన్లు జారీ చేస్తూ పోవడం వల్ల వారు వేధింపులకు గురవుతారని ఆయన అన్నారు. జగన్ ఆస్తుల కేసులో 8,9 చార్జిషీట్లు దాఖలు చేస్తామని సిబిఐ చెబుతోందని, ఇలా అన్ని చార్జిషీట్లకు విడివిడిగా నిందితులు కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని, అది సరైంది కాదని ఆయన అన్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటి వరకు మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. మే 7వ తేదీన సిబిఐ కోర్టులో మూడో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుని జగన్ సహా 13 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన న్యాయవాది ద్వారా గానీ వ్యక్తిగతంగా గానీ హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజయ సాయి రెడ్డి మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.