జగన్కు వయసు లేదన్నారు, బాబు బాటలో: కిరణ్ రెడ్డి
జగన్ ఏకైక లక్ష్యం తాను ముఖ్యమంత్రి కావడం, కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడమే అన్నారు. ఈ లక్ష్యం కోసం ఆయన ఎవరితోనైనా కలుస్తారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే వైయస్ జగన్ తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించారన్నారు. జగన్.. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి బద్ద శత్రువు అయిన నారా చంద్రబాబు నాయుడుతోనైనా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోనైనా కలుస్తాడని మండిపడ్డారు.
చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి 48వేల దొంగ వోట్లు వేయించుకొని గత సాధారణ ఎన్నికలలో గెలుపొందాడని మండిపడ్డారు. జగన్కు ముఖ్యమంత్రి అయ్యే వయస్సు లేదన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం ఆయనకు చెప్పి చూసిందని చెప్పారు.
సిఎం కావాలనుకుంటే నీకు వయస్సు తక్కువుందని, కేంద్రమంత్రిగా కొన్ని రోజులు ఉండమని, కాస్త ఓపిక పడితే ఆ తర్వాత ఆ దిశలో ఆలోచిస్తామని పార్టీ అధిష్టానం జగన్కు చెప్పినప్పటికీ ఆయన వినలేదన్నారు. ఈ విషయాన్ని నేతలందరికీ అధిష్టానం చెప్పిందన్నారు. పేదల గురించి మాట్లాడుతున్న జగన్ లక్షల చదరపు గజాలలో ఇళ్లు ఎందుకు నిర్మించుకున్నారన్నారు. ఆయనకు అలాంటి ఇండ్లు రెండు మూడు ప్రాంతాలలో ఉన్నాయన్నారు.
చంద్రబాబు అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు... బాబు అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసత్యాలే చెబుతున్నారన్నారు. బాబు హైటెక్ సిటీ నిర్మించి, దాని చుట్టూ కార్లో తిరుగుతూ అదే అభివృద్ధి అని భ్రమ పడుతున్నారన్నారు.
హైదరాబాదులో అభివృద్ధి చేశానంటున్న బాబు ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేక పోయారన్నారు. బాబు తన రాజకీయ జీవితంలో ఒక్క నిజమైనా చెప్పి ఉండరని విమర్శించారు. కాగా అనంతరం ఎంపీ మాగుంట ఇంటిలో కార్యకర్తలతో కిరణ్ సమావేశమయ్యారు.