జగన్ను కాపాడిన కిరణ్ ముద్దాయి: చంద్రబాబు
వైయస్ జగన్ వల్లనే అధికారులు, వ్యాపారులు జైలు పాలయ్యారని ఆయన ఆరోపించారు. పేదల సొమ్మును దోచుకుని అవినీతి డబ్బుతో జగన్ టీవీ చానెల్, పత్రిక పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ చర్యలూ తీసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.
తాను రైతుల వెంటే ఉంటానని, రైతుల కోసం పోరాడుతానని చంద్రబాబు తన నెల్లూరు ఎన్నికల ప్రచార సభలో అన్నారు. పొగాకు కేంద్రాల్లో అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం పనికిమాలిన ప్రభుత్వం ఉందని, దానికి ప్రజలు చరమగీతం పాడాలని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పంటల గిట్టుబాటు ధరల కోసం గట్టిగా కృషి చేస్తామన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చెరువుపల్లి గ్రామంలో బుధవారం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.
ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ఉదయం నెల్లూరు వెళ్తూ బాబు తిరుపతిలో కొద్దిసేపు విశ్రమించారు. ఈ సమయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశయ్యారు. అనంతరం నియోజకవర్గ పొలింగ్ బూత్ కన్వీనర్లతో భేటీ అయ్యారు.