రేఖ ప్రమాణం మీడియా కవరేజీపై జయ రుసరుసలు

రాజ్యసభలో తన సీటును మార్పించుకున్న జయ ఇప్పుడు ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారు. రాజ్యసభ టీవీ మీడియా కవరేజీపై ఆమె రాజ్యసభ సచివాలయానికి తన అసంతృప్తిని తెలియజేశారు. తనపై కెమెరా ఫోకస్ చేశారని ఆమె అడిగారు. మీడియా కవరేజీతో తాను మనస్తాపానికి గురైనట్లు ఆమె చెప్పారు. అవే చిత్రాలను న్యూస్ చానెల్స్ తీసుకుని సంచలనం చేశాయని ఆమె అంటున్నారు.
జయా ఫిర్యాదుపై అన్సారీ వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ టీవీ సిఇవోను పిలిపించి వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ఆ కవరేజీపై పలువురు పార్లమెంటు సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. రేఖతో తనకు సంబంధం ఏమిటని, రేఖ ప్రమాణం చేస్తున్నప్పుడు తనను ఎందుకు చూపించారని జయబచ్చన్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
రేఖను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రాజ్యసభకు నామినేట్ చేయగానే సభలో తన సీటు మార్చాలని జయా బచ్చన్ అన్సారీని కోరారు. రేఖకు సమీపంగా కూర్చోవడం ఇష్టం లేక ఆమె సీటు మార్పును కోరినట్లు వార్తలు వచ్చాయి. రేఖతో 1970 దశకంలో బాలీవుడ్ నటుడు, జయా బచ్చన్ భర్త అమితాబ్ బచ్చన్ రోమాన్స్ నడిపినట్లు పుకార్లు సాగుతూనే ఉన్నాయి.
జయాబచ్చన్ రాజ్యసభలో 91 సీటు నుంచి 143 సీటుకు మారారు. రేఖకు జయాబచ్చన్ వరుసలోనే 99వ సీటు కేటాయించారు. దీంతో ఆమె అన్సారీకి విజ్ఞప్తి చేసి ఆయన అనుమతితో సీటు మారారు.












Click it and Unblock the Notifications