చిక్కుల్లో స్వామిగౌడ్: అక్రమాలపై కిరణ్మయి నివేదిక
ప్లాట్ల కేటాయింపులో భారీ అవకతవకలు జరిగాయని విచారాధికారి కిరణ్మయి నిర్ధారించారు. 1991లో గచ్చిబౌలి, గోపన్నపల్లెలో టీన్జీవోలకు 160 ఎకరాలు కేటాయింపు జరిగింది. సభ్యత్వ నమోదు పుస్తకాన్ని నిర్వహించకుండా ఇష్టానుసారంగా ప్లాట్లు కేటాయించినట్లు నివేదికలో కిరణ్మయి తెలిపారు. 240 ప్లాట్లను బినామీ పేర్లతో కేటాయించారని తెలిపారు. దొంగ అఫిడవిట్లు ఇచ్చినట్లు విచాణలో వెల్లడించారు. ఇతర జిల్లాల టీన్జీవోలు, గెజిటెడ్ అధికారులుకు ప్లాట్లు కేటాయించినట్లు నిర్ధారణ అయినట్లు నివేదికలో కిరణ్మయి స్పష్టం చేశారు. సీనియారిటీ లిస్టు కూడా ఇవ్వలేదని కిరణ్మయి తన నివేదికలో తెలిపారు. ఆమె ప్రభుత్వానికి వేయి పేజీల నివేదికను సమర్పించారు.
టీఎన్జీవో సోసైటీ స్థలాల కేటాయింపులో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని టీన్జీవో నేత స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం నాడు టీన్జీవో సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి సహకార శాఖ అధికారిని కిరణ్మయి ఇచ్చిన నివేదికపై ఆయన స్పందించారు. రాజకీయంగా ఎదుగుతున్నందుకే తనపై కుట్ర పన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనకు నివేదిక ఇవ్వకుండానే లీక్ చేశారని స్వామిగౌడ్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో స్వామి గౌడ్ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో ఆ కుంభకోణం బయటకు వచ్చింది. నివేదిక నేపథ్యంలో టిఎన్జీవోల సంఘం నాయకులు కొంత మంది స్వామిగౌడ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సకల జనుల సమ్మెను స్వామి గౌడ్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని వారు ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులను స్వామి గౌడ్ మోసం చేశారని వారున్నారు. వారు సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.