డిఫ్రీజ్కు ఓకే: జగన్ సాక్షికి హైకోర్టులో ఊరట, షరతులు
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో ఉన్న రూ.94 కోట్ల ఎఫ్డిల జోలికి వెళ్లవద్దని సాక్షికి సూచించింది. వసూళ్లు, చెల్లింపులు చెక్కుల రూపంలోనే జరగాలని పేర్కొంది. సిబిఐ దర్యాఫ్తునకు సహకరించాలని, వాళ్లు అడిగిన వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించింది. కరెంట్ ఖాతాలలో ఉన్న రూ.9 కోట్ల రూపాయలకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని, స్థిరాస్తులను ష్యూరిటీగా చూపాలని సూచించింది.
ఉద్యోగుల జీతాలను కూడా అకౌంట్ పే ద్వారా చెల్లించాలని తెలిపింది. జగన్ మీడియా అకౌంట్ల నిర్వహణ, లావాదేవీల వ్యవహారాలను ప్రతి నెల 10వ తేదిన సిబిఐకి నివేదిక రూపంలో అందచేయాలని చెప్పింది. ఉద్యోగుల జీతభత్యాలు, పత్రికా ముద్రణకు మాత్రమే డబ్బులను తీసుకోవాలని, ప్రకటనల ద్వారా, సర్క్యులేషన్ ద్వారా వచ్చే డబ్బును వేతనాలు ఇచ్చేందుకు ఉపయోగించాలని సూచించింది.
ఆస్తుల క్రయవిక్రయాలు జరపరాదని సాక్షికి సూచించింది. కాగా ఇటీవల జగన్ మీడియాకు చెందిన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాలను సిబిఐ స్తంభింప చేసిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ ప్రత్యేక కోర్టులో సాక్షి మీడియాకు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ సాక్షికి ఊరట లభించింది.