జగన్కు షాక్: 25న హాజరు కావాల్సిందేనని హైకోర్టు
అరెస్టు చేసేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఈ నెల 25వ తేదీన విచారణకు పిలిచిందని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. జూన్ 15వ తేదీ వరకు సిబిఐ విచారణ నుంచి తనను మినహాయించాలని కోరుతూ వైయస్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు నడిచాయి. ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని వైయస్ జగన్ కోరారు.
వైయస్ జగన్ జూన్ 15వ తేదీ తర్వాత విచారణకు వస్తారని చెబుతూ అందుకు అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్ వ్యవహారంపై విచారించేందుకే వైయస్ జగన్ను నోటీసులు ఇచ్చినట్లు సిబిఐ తెలిపింది. నిమ్మగడ్డ ప్రసాద్ను సిబిఐ 13 సార్లు విచారించినా జగన్ను ఒక్కసారి కూడా పిలువలేదని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడే జగన్ను ఎందుకు పిలిచారని అడిగారు.
వచ్చే నెల 12వ తేదీన 18 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఉప ఎన్నికల ప్రచారంలో తనకు తీరిక లేకుండా పోయిందని, ప్రచారంలో పాల్గొనాల్సిన బాధ్యత తనపై ఉందని, అందువల్ల తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ తన పిటిషన్లో వివరించారు. ప్రస్తుత పరిస్థితిలో కోర్టును ఆశ్రయించడం తప్ప తనకు వేరే మార్గం లేకుండా పోయిందని ఆయన చెప్పుకున్నారు.
తన ఆస్తుల కేసులో ఇప్పటి వరకు సిబిఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసిందని, ఈ ఎనిమిదిన్నర వ్యవధిలో తనను విచారణకు పిలువలేదని ఆయన అన్నారు. తాను చట్టానికి కట్టుబడే వ్యక్తినని ఆయన చెప్పుకున్నారు. తాను ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో తనను సిబిఐ విచారణకు పిలువడం సహేతుకం కాదని ఆయన అన్నారు. ఈ నెల 25వ తేదీన తమ ముందు హాజరు కావాలని సిబిఐ నోటీసులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.