మోపిదేవిని బలిపశువును చేశారు: మంత్రి దానం
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రులు పిలిచి సంతకాలు చేయాలని అడిగినప్పుడు మంత్రులు చేయక తప్పదని, మోపిదేవి కూడా ఆ విధంగానే వ్యవహరించారని ఆయన అన్నారు. నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల వ్యవహారంలో ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు ఆయన తెలిపారు. మోపిదేవి నిర్దోషిగా తిరిగి మంత్రివర్గంలోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మోపిదేవి అరెస్టు వ్యవహారం కోర్టులో ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎవరు ఎవరిని కలిసినా తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు ఉండవని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసులోకి ఎవరూ వెళ్లబోరని ఆయన అన్నారు. తాము 2014 వరకు అధికారంలో ఉంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి కాలం కొసాగుతారని ఆయన చెప్పారు.
మోపిదేవి అరెస్టు దురదృష్టకరమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. మోపిదేవి అరెస్టుతో పత్తిపాడు, మాచర్ల ఉప ఎన్నికలకు ఇంచార్జీ నియామకంపై ఆయన శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి సుదర్శన్ రెడ్డిని ఇంచార్జీగా నియమించినట్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. సీమాంధ్రలో తెలంగాణవారికి రాచమర్యాదలతో స్వాగతం చెప్తామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు తప్ప ఎవరికి ఓటు వేసినా నిప్పుల్లో పోసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
అవాకులు చెవాకులు పేలవద్దని మంత్రి కొండ్రు మురళి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు సూచించారు. 2009లో వైయస్ జగన్ పన్ను చెల్లించడానికి అన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎవరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లబోరని ఆయన అన్నారు. సాక్షిలో దుర్మార్గపు వార్తలు రాస్తున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, అందుకే విధ్వంసానికి కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని వైయస్ జగన్ ఎప్పటి నుంచో చెబుతున్నారని, అవిశ్వాస ప్రతిపాదన సమయంలోనే జగన్ బలమెంతో తేలిపోయిందని ఆయన అన్నారు. జగన్ వెంట ఒకరిద్దరు వెళ్తే నష్టం లేదని ఆయన అన్నారు.