వైయస్ పెంపకంలోనే లోపం: జగన్పై బొత్స వ్యాఖ్య

వైఎస్ పెంపకంలోనే లోపమున్నదని అనుకుంటున్నానని, తప్పు చేసినప్పుడు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని, అలా చేయనప్పుడు ఇలానే ఉంటుందని అన్నారు. ఆదివారం రాత్రి గాంధీభవన్లో ఆయన మీడియా మాట్లాడారు. రాజకీయ ముసుగులో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కొంతమంది సంఘ విద్రోహ శక్తులను ప్రభుత్వం గట్టిగా ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్ యత్నిస్తోందన్న జగన్ ఆరోపణను ఆయన తిప్పికొట్టారు.
జగన్పై సానుభూతి తగ్గుతుందన్న వాస్తవాలు గుర్తెరిగి బేలతనంతో రాజకీయ ప్రాపకం కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వాయిదా పడితే ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి జగన్ లాంటి వ్యక్తులు ప్రమాదకరమని, రాజకీయంగా దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రజల ధన, ప్రాణాలను రక్షించాల్సిందిపోయి వారి ప్రాణాలతో ఆటలాడుకోవాలనుకోవడం బాధాకరమని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఎన్నికలు జరుగుతాయని, ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వంద బస్సులు తగలబెడితేనో, ఇంకేదో చేస్తేనో ప్రభుత్వం సహించదన్నారు. 'బస్సు తగులబెట్టిన రామ్మోహన్ మీ పార్డీవాడు కాదా? పుత్తా ప్రతాపరెడ్డి, రాజ్ఠాకూర్ మీ పార్టీ లీడర్లు కారా?. ప్రజలేమైనా ఫరవాలేదనుకంటే మీ ఆటలు సాగవు' అని హెచ్చరించారు. పత్రిక, టీవీలను అడ్డుపెట్టుకొని జగన్ దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. డబ్బు మదంతో ఏమి రాసినా చెల్లుతుందనుకుంటున్నావా? అని, ఏదీ నీ పత్రిక స్వేచ్ఛ?. ఎల్లో జర్నలిజానికి పాల్పడుతూ మంగలికృష్ణతో సంబంధాలు కలిగి అక్రమ ఆయుధాలు, సెటిల్మెంట్లు చేస్తుండటమే భావ ప్రకటన స్వేచ్ఛా? అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు జరిగినా అంతిమంగా ప్రజాస్వామ్యం, నీతే గెలుస్తాయని బొత్స అన్నారు.
జగన్ అన్యాయాలను, దోపిడీలను ప్రజలు తిప్పికొడతారన్నారు. మాజీ మంత్రి మోపిదేవి జైలుకెళ్లడానికి బొత్సే కారణమన్న కథనాలపై స్పందిస్తూ.."నేను సంతకం పెట్టమంటే మోపిదేవి పెట్టాడా?. నాకు డబ్బులు కావాలి సంతకం పెట్టు అని కోరానా? బల్ల కింద సంతకాలు పెట్టమని కోరానా? ఏమి మాటలవి? ఇదేనా జగన్ పత్రిక స్వేచ్ఛ. ఇది ఎల్లో జర్న లిజం కాదా"? అని ప్రశ్నించారు.
పార్టీని వీడిన వారిపై చర్యలు తప్పవని, వెళ్లిన ప్రతివారూ ఏదో ఒక కారణం చెబుతారని, జగన్ అవినీతిలో కూరుకుపోయారని, ఎలా బయట పడాలా అని ఎత్తులు వేస్తున్నారని, రెండు మూడు నెలలుగా 30 మంది ఎమ్మెల్యేలలో సంప్రదింపులు జరిపారని, కానీ వారి వలలో ఇద్దరే పడ్డారని అన్నారు. అనర్హత వేటు వేయడమే కాకుండా, ప్రస్తుత శాసన సభ పూర్తయ్యేదాకా పోటీ చేయకుండా చర్య తీసుకునే నిబంధన ఉందని, ఆ ప్రకారం చేయమని స్పీకర్కు అఫిడవిట్ ఇస్తామని చెప్పారు.
తెలుగుదేశం మాజీ నేత మైసూరా రెడ్డి రాజా ఆఫ్ కరెప్షన్ పుస్తకంలో వైఎస్ అవినీతి గురించి మాత్రమే చెప్పడం హాస్యాస్పదమన్నారు. వైయస్ దుర్మార్గుడిగా కనిపించి, జగన్ మాత్రం నీతి, నిజాయితీ పరుడుగా కనిపిస్తారా అని ప్రశ్నించారు. జగన్ ఆ రోజు ఉన్న అవకాశాలను ఆసరా తీసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, జగన్తో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారని, మాయ చేయకుండా ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అని ఆయన అన్నారు. రాజకీయ వ్యవస్థలో తప్పులు జరగడానికి అవకాశం ఇవ్వ వద్దని చెబుతున్నామని అన్నారు.
వైయస్ విజయ అధర్మంగా మాట్లాడుతున్నారని బొత్స అన్నారు. వైయస్ మరణాన్ని, జగన్ అరెస్టును కలిపి మాట్లాడడం తగదన్నారు. వైఎస్ చనిపోయినప్పుడు అందరమూ బాధపడ్డామని , ఆవేదన వ్యక్తం చేశామని చెప్పారు. "33 మంది ఎంపీలు ఇప్పుడే గెలిచారా..? గతంలోనూ కూడా గెలిచాం. నేనూ ఎంపీనయ్యా. వైఎస్, కాంగ్రెస్ కలిస్తేనే అన్ని సీట్లు వచ్చాయి. 1999లో ఎందుకు రాలేదు అన్ని ఎంపీ సీట్లు ? వైయస్ కాంగ్రెస్ గౌరవించింది. మేమూ గౌరవిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications