జగన్ను విచారించనున్న ఈడి: విజయమ్మ దీక్షకు నో

ఈ రెండు చట్టాల కింద ఆయనతో పాటు, కొందరు అధికారులపై వేర్వేరుగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు, విదేశీ కంపెనీల్లోకి మళ్లిన నిధులపై ఈడి ప్రశ్నించనుంది. ఇందుకోసం అనుమతి కోరుతూ ఈడి.. కోర్టుకు వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పిఎంఎల్ఎ చట్టం ప్రకారం ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయడంతోపాటు ఇప్పటివరకు తమ దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంట్లు, సమాచారంపై జగన్ వివరణ తీసుకోవడానికి ఈడి ప్రయత్నిస్తోంది.
ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన తొలి చార్జిషీట్ ప్రతిని కూడా ఈడి ఇప్పటికే తీసుకుంది. ఈడి వీరిని హైదరాబాదులోనే విచారించే అవకాశముందని తెలుస్తోంది. జగన్ తన వివిధ కంపెనీలలో ఆర్థిక వ్యవహారాల గురించి, విదేశీ కంపెనీలలో తాను పెట్టిన పెట్టుబడుల గురించి ఈడికి వివారణ ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీ, హైదరాబాదులకు చెందిన బృందాలు జగన్ను ప్రశ్నిస్తాయి. తమ దగ్గరున్న పత్రాలతో ఆయన వాదనను నిలదీస్తాయి.
కాగా లోటస్ పాండు వద్ద వైయస్ విజయమ్మ దీక్ష కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు టెంట్ వేసేందుకు ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. తన కొడుకు జగన్ను విడుదల చేసే వరకు దీక్ష చేస్తానని ఆమె తెలిపారు. రాత్రి నుండి ఆమె దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ఆమె రాత్రి దిల్ కుషా అతిథి గృహం వద్ద రోడ్డు పైనే కోడలు, కూతురుతో పాటు బైఠాయించారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పోలీసులు వారిని బలవంతంగా వారి ఇంటికి తరలించారు.
దీంతో వారు అక్కడే తమ ఇంటి ముందు బైఠాయించారు. ఉదయం విజయమ్మ దీక్ష కోసం కార్యకర్తలు టెంట్ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రాపురం అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోసు, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి తదితరులను హౌస్ అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు వైయస్సార్ కాంగ్రెసు బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పలుచోట్ల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications