నేను పారిపోను: జగన్, అరెస్ట్ పొలిటికల్ స్టంట్: లాయర్

జగన్ది రాజకీయ కుటుంబం అని, ఆయన సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ఆయన ఎక్కడకూ పారిపోయే అవకాశాలు లేవని వెంటనే బెయిల్ ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కోర్టు సమన్లు జారీ చేశాక, సిబిఐ అరెస్టు చేసిందని, ఇది కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందని అన్నారు. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందని చెప్పారు. సిబిఐ కోర్టులో అనేక ఛార్జీషీట్లు కూడా దాఖలు చేసిందన్నారు. ఇలాంటి సమయంలో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశమెక్కడిదన్నారు.
జగన్ అరెస్టు పూర్తిగా అక్రమమన్నారు. కేసు మొత్తం ఓ పొలిటికల్ స్టంట్ అని, ఫిర్యాదుదారుడు ఓ రాజకీయవేత్త అని చెప్పారు. కేవలం కక్ష సాధింపు కోసమే జగన్ పైన కేసులు వేశారన్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు బలవంతంగా డబ్బులు పెట్టినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. వారు లాభాల దృష్టితోనే పెట్టుబడులు పెట్టారన్నారు. జగన్ను అరెస్టు చేసి కోర్టు ధిక్కారణకు సిబిఐ పాల్పడిందన్నారు.
సిబిఐ నోటీసులు జారీ చేయగానే జగన్ విచారణకు హాజరయ్యారని చెప్పారు. జగన్ పై కేసులు, అరెస్టు ఓ రాజకీయ కుట్ర అన్నారు. రాజకీయ అజెండాలో జగన్ ఓ బాధితుడిగా మారిపోయాడన్నారు. సిబిఐ అడిగిన ప్రతి ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పారన్నారు. ఏ సాక్షిని జగన్ ప్రభావితం చేయలేదన్నారు. కాగా జగన్ అరెస్టు సక్రమమా అక్రమమా అన్న అంశంపై వాదనలు విన్న అనంతరం జడ్జి తీర్పును మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications