జగన్ ప్రశాంతంగా ఉన్నారు: షర్మిళ, కలిసిన ఫ్యామిలీ
వారితో పాటు మాజీ జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్, గంగిరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి మొత్తం ఎనిమిది మంది వచ్చారు. జగన్ను కలిసిన అనంతరం షర్మిళ మాట్లాడుతూ.. జగన్ చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు.
వైయస్ జగన్ లేని లోటును విజయమ్మ తీరుస్తారని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. జగన్ చాలా ధైర్యంగా ఉన్నారన్నారు. ఉప ఎన్నికలలో అన్ని సీట్లను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలు ఆపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. జైలు జీవితం జగన్ను ఇబ్బంది పెట్టదన్నారు. ఉప ఎన్నికలలో ప్రచారానికి దూరం చేసే కుట్రతోనే జగన్ను అరెస్టు చేశారన్నారు. ఉప ఎన్నికల సమయంలో జగన్ అరెస్ట్ మాకు నష్టమే అయినా భర్తీ చేస్తామన్నారు.
జగన్ ఆస్తుల కేసులో సిబిఐ విచారణ తొమ్మిది నెలలుగా జరుగుతోందని, కానీ ఇప్పుడే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. జగన్ అరెస్టు వెనుక కుట్ర సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోందన్నారు. దీంతో తమకు ఇంకా మద్దతు ప్రజల నుండి పెరుగుతోందన్నారు. జగన్ రెండున్నరేళ్లుగా ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారన్నారు.