గాలి బెయిల్ డీల్, చలపతిరావు ఇంట్లో సిబిఐ సోదాలు
చలపతి రావు ఇద్దరు సోదరుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. సిబిఐ ప్రత్యేక బృందం చలపతిరావు ఇద్దరు సోదరులను ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన చలపతి రావు బంధుత్వాలపై కూడా సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. చలపతిరావు ఎసి కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. ఆరుగురు అధికారులు చలపతి రావు సోదరుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు.
చలపతి రావుకు ఎవరెవరితో సంబంధాలున్నాయనే విషయంపై కూడా సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డితో పట్టాభిరామారావుకు డీల్ కుదుర్చడంలో ఐదుగురు వ్యక్తులు పాలు పంచుకున్నట్లు చెబుతున్నారు. బెయిల్ మంజూరు చేస్తే పట్టాభి రామారావుకు అందిన డబ్బులు తొలుత పది కోట్ల రూపాయలే అని భావించినప్పటికీ అది 15 కోట్ల రూపాయలని తర్వాత తేలింది.
డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాస రావు నివాసంలోనూ, న్యాయవాది తారకరామ్ నివాసంలోనూ సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. చలపతి రావు సోదరుల నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత సమాచారం ఇస్తారని చెబుతున్నారు. పట్టాభి రామారావు కేసులో ఏ క్షణంలోనైనా అరెస్టులు జరుగుతాయని భావిస్తున్నారు.
ముడుపులు అంగీకరించి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి పట్టాభి రామారావును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కూడా సిబిఐ దర్యాప్తు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కేసులు నమోదు చేసి అరెస్టులు చేసేందుకు సిబిఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.