గాలి బెయిల్ డీల్: మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి గరం

గాలి జనార్దన రెడ్డి బెయిల్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, దీనిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన అన్నారు. గాలి బెయిల్ వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని స్పష్టం చేశారు. తనపై బురద వేసి తుడుచుకొనేలా చేస్తే మాత్రం పరువు నష్టం దావా వేస్తానని, ఇప్పటికే న్యాయవాదులతోనూ మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు.
"న్యాయ శాఖ మంత్రిని అయినంత మాత్రాన నిందితులకు బెయిల్ ఇప్పించే బ్రోకర్లా వ్యవహరిస్తానని ఎలా అనుకుంటారు? నాకు గాలి జనార్దన రెడ్డి బంధువైనంత మాత్రాన నా బాధ్యతను విస్మరించి బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని ఎలా అనుకుంటారు?'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తనపేరు ప్రస్తావనకు రావడం మనస్తాపానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి తనకు బంధువు అవుతారని అసెంబ్లీలోనే చెప్పానని, అంత మాత్రాన బెయిల్ ఇప్పిస్తానని ఎలా అనుకుంటారని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి తనకు బంధువులు అవుతారని, అయినా తాను ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ఆయన అన్నారు. తన రాజకీయ జీవితంలో మచ్చ లేదని ఆయన అన్నారు. తనపై బురద చల్లే కార్యక్రమం తప్ప మరోటి కాదని ఆయన అన్నారు.
కాగా, పట్టాభి రామారావు వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడానికి ముడుపులు తీసుకున్నట్లు పట్టాభి రామారావుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది.












Click it and Unblock the Notifications