గాలి బెయిల్ డీల్ రూ. 60 కోట్లు: యాదగిరి మెయిన్?
యాదగిరి ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బండరాళ్లు కూడా తొలగించి సిబిఐ అధికారులు తనిఖీలు చేసినట్లు చెబుతున్నారు. నిన్నటి వరకూ రెండు, మూడు బ్యాంకులలో మాత్రమే లాకర్లు గుర్తించిన సీబీఐ అధికారులు, నేడు మరికొన్ని బ్యాంకులలో కూడా నకిలీ పేర్లతో లాకర్లు తెరిచిన వైనాన్ని కనిపెట్టారు. పట్టాభి రామారావు కుమారుడు బాలాజీ పేరు మీద హైదరాబాదులోని ఐదు బ్యాంకు లాకర్లలో సొమ్ము దాచినట్లు చెబుతున్నారు. వాటిని బాలాజీ నిత్యం చెక్ చేసుకుంటూ వస్తున్నాడని అంటున్నారు. మొత్తం 60 కోట్ల రూపాయల డీల్లో 15 కోట్ల రూపాయలు హైదరాబాదు చేరినట్లు సిబిఐ గుర్తించిందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు సిబిఐ అధికారులు మూడు కోట్ల రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు.
గాలి బెయిల్ వ్యవహారం బట్టబయలైన తర్వాత ఇంక ఎవరూ రాబోరని భావించి ఉంటారేమో, ఏమో ఓ బ్యాంకు లాకర్లో పట్టాభి కుమారుడు దాచిన సొమ్మును స్వాహా చేసేందుకు సిబ్బంది స్వయంగా ప్రయత్నించారు పట్టాభి కుమారుడు వచ్చి చూసుకుని లాకర్లో డబ్బు లేకపోవడంతో మొత్తుకున్నాడని అంటున్నారు. బ్యాంకు అధికారులను నిలదీశాడని చెబుతున్నారు. దీనితో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. బ్యాంకు సీసీ కెమెరాల్లో ఇది రికార్డయింది.
మరోపక్క ఈ అవినీతి వ్యవహారంలో ప్రమేయమున్న ప్రతీ ఒక్కరి నివాసాలపై శనివారం సిబిఐ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ముడుపుల భాగోతానికి మధ్యవర్తిత్వం వహించిన మాజీ న్యాయమూర్తి టివి చలపతిరావు స్వస్థలం గుంటూరులో ఆరుగురు అధికారులతో కూడిన సిబిఐ బృందం వివరాలు సేకరించింది. చిలకలూరిపేటలోని ఆయనకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను కూడా తీసుకు న్నట్లు తెలుస్తున్నది. అయితే అనూహ్యంగా చలపతిరావు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆయన గురునానక్ కేర్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. అయితే వివరాలు వెల్లడించేందుకు వైద్యులు నిరాకరించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న పట్టాభి సోదరుడు కృష్ణమోహన్ నివాసాన్ని మాత్రం సిబిఐ అధికారులు తనిఖీ చేయలేదు. గుడివాడలో పట్టాభి రాముడికి ఎలాంటి ఆస్తులు లేవని, సిబిఐ అధికారులు తమ ఇంట్లో సోదాలు చేయలేదని ఆయన సోదరుడు కృష్ణమోహన్ స్పష్టం చేశారు. యాదగిరిపై రౌడీ షీట్ ఉంది. సురేంద్ర బాబు సైబరాబాద్ పోలీసు కమిషనర్గా వచ్చిన తర్వాత అతనిపై రౌడీ షీట్ తెరిచినట్లు చెబుతున్నారు.