పొడుచుకుతింటున్నారు: షర్మిల, చంపుతామా: విజయ
ఉప ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు ఓటేయాలని ఆమె కోరారు. రాజన్న రాజ్యం వచ్చేలా తీర్పు ఇవ్వాలని ఆమె సూచించారు. ఉప ఎన్నికల్లో తీర్పు కోసం దేశమంతా ఎదురు చూస్తోందని ఆమె అన్నారు. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినవారికి ఓటు వేయవద్దని ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసుకు ఈ ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు.
వైయస్సార్ కాంగ్రెసు పా్రటీ అభ్యర్థి బాలరాజుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె నియోజకవర్గం ఓటర్లను కోరారు. రైతన్న కోసం బాలరాజు పదవిని వదులుకున్నారని ఆమె అన్నారు. బాలరాజుకు ఓటు వేస్తే వైయస్ రాజశేఖర రెడ్డి ఇంకా మీ గుండెల్లో బతికే ఉన్నారని నమ్మకం కలుగుతుందని ఆమె అన్నారు. బాలరాజుకు ఓటేస్తే జగనన్న నిర్దోషి అని అర్థమవుతుందని ఆమె అన్నారు. ఏ సందర్భంలోనూ జగన్ సాక్షులను ప్రభావితం చేయలేదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని తాము చంపుకుంటామా, తమ మనిషిని తాము చంపుకుంటామా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ కుట్ర చేసి చంపారనే అనుమానం కలుగుతోందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆ విధంగా స్పందించారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ప్రజల ముందుకు వస్తే అధికార దాహమంటారా అని, వైయస్ను తాము చంపామని అంటారా అని ఆమె అడిగారు.
వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయి ఉండేది కాదని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై ప్రజలందరికీ అనుమానం ఉందని, ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెసు ప్రభుత్వానికి ఉందని ఆమె అన్నారు. ఈ ఉప ఎన్నికలు రాజకీయాలను మార్చివేస్తాయని ఆమె అన్నారు.