భార్య ఆత్మహత్య కేసులో టెక్కీకి పదేళ్ల జైలు శిక్ష
చార్జిషీట్ వివరాల ప్రకారం - దుర్గాంబ అనే అమ్మాయిని 2006 జూన్ 15వ తేదీన వీర రాజు అలియాస్ సవకుల వీర రాజు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వివాహం చేసుకున్నాడు. అయితే, అతనికి అప్పటికే మరో అమ్మాయితో సంబంధాలున్నాయి. దీంతో దుర్గాంబికతో సరైన సంబంధాలను కొనసాగించలేకపోయాడు. ఆమెను తీవ్ర మానసిక హింసకు గురి చేశాడు. దీంతో దుర్గాంబిక ఆత్మహత్య చేసుకుంది.
వివాహం తర్వాత మూడు రోజుల పాటు రాజు దుర్గాంబికతో ఉన్నాడు. ఆ తర్వాత బెంగుళూర్లో తన ఉద్యోగానికి వెళ్లిపోయాడు. తనకు మరో అమ్మాయితో సంబంధం ఉందని, కుటుంబం ఒత్తిడి వల్ల తాను ఈ వివాహం చేసుకున్నానని రాజు తనతో చెప్పాడంటూ దుర్గాంబిక కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు బెంగుళూర్ వెళ్లి రాజుకు నచ్చజెప్పారు.
ఐదు నెలల పాటు దుర్గాంబికతో రాజు గడిపాడు. ఆ తర్వాత అతనికి బెంగళూర్ నుంచి చెన్నైకి బదిలీ అయింది. మధ్య మధ్యలో రాజు దుర్గాంబిక తండ్రి కృష్ణా రావుతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆమె మాట్లాడితే మాత్రం బండబూతులు తిట్టేవాడు. రావు దుర్గాంబికను అక్టోబర్ 26వ తేదీన చెన్నైలోని వీర్రాజు వద్దకు తీసుకుని వెళ్లాడు. ఆమె చస్తే తాను సంతోషంగా ఉంటానని వీర్రాజు నవంబర్ 2వ తేదీన అన్నాడు. అంతే, మర్నాడే దుర్గాంబిక విషం సేవించినట్లు, ఆ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కృష్ణారావుకు సమాచారం వెళ్లింది. అతను వెళ్లే సరికే కూతురు మరణించింది.