రాజంపేట: జగన్ ఇలాకాలో హోరాహోరీ, 'చీలిక'పై టిడిపి
మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెసు ఓట్లు చీలిపోయినందున జగన్ను కోలుకోలేని దెబ్బ తీయాలని చూస్తోంది. ఇక కాంగ్రెసు సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకెళుతోంది. రాజంపేట మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కులం, సానుభూతి ప్రధానాంశాలుగా హోరాహోరీ పోరు జరుగుతోంది. కడప జిల్లా వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. కానీ... రాజంపేటలో మాత్రం కుల రాజకీయాలు బలంగా నడుస్తాయి.
రెడ్లు, ఇతరులు అనే భావన ఇక్కడ బాగా కనిపిస్తుంది. రాజంపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా మేడా మల్లికార్జున రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున పసుపులేటి బ్రహ్మయ్య(బలిజ) బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుపైన బ్రహ్మయ్య గంపెడాశలు పెట్టుకున్నారు. ఇందుకు తోడు ప్రత్యర్థులిద్దరూ రెడ్డి వర్గానికే చెందిన వారు కావడంతో... వారి ఓట్లు చీలి తమకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు.
రెడ్ల ఓట్లలో మెజారిటీ ఓట్లు తమకే పడతాయని, దీనికి తోడు ఎస్సీ, మైనారిటీలు తమ వైపే ఉన్నారని జగన్ పార్టీ గట్టిగా భావిస్తోంది. వైయస్ ప్రభావం, జైలులో జగన్ అనే సానుభూతి తమకు కలిసొస్తాయని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అధికార కాంగ్రెస్... రెడ్డితోపాటు ఎస్సీ, మైనారిటీలలో తమ సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకుంది. పైస్థాయిలో కలిసికట్టుగా ప్రచారం చేస్తూనే... నియోజకవర్గ స్థాయిలో చోటామోటా నేతలను పనులు, పదవుల మంత్రం వేసి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు పార్టీల అగ్రనేతలు రాజంపేట నియోజకవర్గంలో పర్యటించారు.