జగన్ అండ్ కో రాబడి రూ. 16 లక్షల కోట్లు: దాడి

తన ఆరోపణకు మద్దతుగా ఈ భూములు పొందిన వ్యక్తులు, సంస్థల జాబితాను, రాష్ట్రంలో ఏ జిల్లాలో వీటిని పొందారో వివరించే చిత్రపటాన్ని కూడా ఆయన విడుదల చేశారు. తమ ఆధీనంలో ఉన్న గనుల ద్వారా జగన్ బృందం రాబోయే 15 ఏళ్లలో రూ.16 లక్షల కోట్ల ఆదాయం గడించే అవకాశం ఉందని వెల్లడించారు. తాము అడ్డగోలుగా ఈ ఆరోపణ చేయడం లేదని, ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో వైయస్ రాజశేఖ రెడ్డి తన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్కు చెందిన రక్షణ స్టీల్స్కు 1.40 లక్షల ఎకరాల (56 వేల హెక్టార్లు) ఇనుప ఖనిజం గనులు కేటాయించారని, వీటిలో 1100 కోట్ల టన్నుల ఖనిజం ఉన్నట్లు అంచనా అని ాయన చెప్పారు.
టన్ను ఖనిజం ధర రూ.3500 వేసుకొంటే రాబోయే ఇరవై, పాతికేళ్లలో రూ.40 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని, తాము కేవలం 15 ఏళ్లలో రూ.14 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని మాత్రమే లెక్క వేశామని, మా లెక్కలకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొన్నామని వివరించారు. అదే జిల్లాలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చేతిలో 600 ఎకరాల బెరైటీస్ గనులు ఉన్నాయని, 15 ఏళ్లలో లక్ష కోట్ల ఆదాయం వస్తుందని లెక్క వేశామని వివరించారు.
జగన్కు ఎన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చినా తమకు బాధేం లేదని, కానీ, రాష్ట్రానికి రావాల్సిన ఇంత భారీ ఆదాయం ఒక కుటుంబపరం కావడంపైనే మా ఆందోళన అని ఆయన అన్నారు. 15 ఏళ్లలో రూ.16 లక్షల కోట్ల ఆదాయం ఒక కుటుంబానికి వెళ్తే ఈ రాష్ట్రం ఏం కావాలని, అదే ఆదాయం ప్రభుత్వానికి వస్తే ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా ప్రభుత్వాన్ని నడపవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. తమ కుటుంబ సభ్యులు, ఆప్తులు, మిత్రుల పేర్లతో ఈ భూములు, గనులు కేటాయించినా అవన్నీ వైయస్ కుటుంబానికి చెందినవేనని, విశాఖ మన్యంలో బాక్సైట్ గనుల కేటాయింపును వైయస్ స్వయంగా నడిపించారని ఆయన అన్నారు. అవి తమవేనని చెప్పి వైయస్ అందరి నోరు మూయించారని ఆయన అన్నారు.
తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ చెలరేగిపోయారని, ఇది అవినీతి కాదుని, దోపిడీ అని, ఈ దోపిడీని చూసి ఘోరీలు, గజనీలు కూడా తలవంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. 2004లో తన ఆదాయం రూ.9 లక్షలని జగన్ చెప్పారని, 2009లో తనకు రూ.77 కోట్ల ఆస్తి ఉందన్నారని, 2010 వచ్చేసరికి ముందస్తు పన్నే రూ.85 కోట్లు కట్టారని, 2011లో తన ఆస్తి రూ.445 కోట్లుగా చూపిస్తూ ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని దాడి వీరభద్ర రావు గుర్తు చేశారు. జగన్ పేపర్లు, టీవీలు, సండూర్, సిక్కిం పవర్ ప్లాంట్లు, బెంగళూరు, హైదరాబాద్ల్లోని రాజ భవనాలు, భారతి సిమెంటు, ఎమ్మార్ విల్లాలు, హైదరాబాద్లో భూములు, జలయజ్ఞం కమీషన్ల జోలికి తాము పోవడం లేదని, కేవలం వారి అధీనంలో ఉన్న భూములు, గనుల గురించి మాత్రమే చెబుతున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications